మిర్యాలగూడ, నవంబర్ 28 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ పార్టీ మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఎమ్మెల్యే భాస్కర్రావును గెలిపించాలని కోరుత మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్చౌక్ వరకు వేలాది మంది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు అలుగుబెల్లి అమరేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
2018 నుంచి 2023 వరకు మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.2750 కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించినట్లు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.10 కోట్లతో కేసీఆర్ కళావేదిక నిర్మించామని, రూ.13 కోట్లతో నల్లగొండ రోడ్డు విస్తరణ చేపట్టి సెంట్రల్ లైటింగ్తోపాటు ఇరువైపులా డ్రైనేజీలను నిర్మించామని చెప్పారు. రూ.130 కోట్లతో ఈదులగూడ నుంచి రైల్వే బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు, వ్యాపారులకు మూడు గంటల కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాలా, 24 గంటల కరెంట్ ఇచ్చే బీఆర్ఎస్ కావాలో ఆలోచించాలన్నారు. పదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ రంగాలను జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నారని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు.
పేదలను ఆదుకునేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమాతో రైతులను ఆదుకుంటున్నారని అన్నారు. మరోమారు గెలిపిస్తే ఆసరా పింఛన్లు రూ.5016కు, దివ్యాంగుల పింఛన్లు రూ.6016కు పెంచుతామని వివరించారు. రేషన్కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం, రూ.400కే వంట గ్యాస్ సిలిండర్ అందించనున్నట్లు తెలిపారు.
మిర్యాలగూడను జిల్లాగా చేసి మీ రుణం తీర్చుకుంటానని.. మరోమారు తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి నల్లమోతు జయ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్, ఆర్యవైశ్య రాష్ట్ర మహిళా విభాగం నాయకులు రాయపూడి భవాని, ఎంపీపీ నూకల సరళాహన్మంతరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ కౌన్సిలర్ అన్నభీమోజు స్రవంతీనాగార్జునచారి, ధూలిపాల కళావతి, రవి, అహ్మద్ చావూష్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పట్టణంలో చేపట్టిన ర్యాలీ విజయవంతం చేసిన వారికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు కృతఙ్ఞతలు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు, రైతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.