అడవిదేవులపల్లి, నవంబర్ 6 : సీఎం కేసీఆర్ పాలనలోనే మిర్యాలగూడ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని నడిగడ్డ, జాలకోటితండా, సారెగూడెం, నల్లమిట్టతండా, బంగారికుంటతండా, చింతచెట్టుతండా, మొల్కచర్ల, బాలాజీతండా, బాల్నెపల్లి, చిట్యాల, ముదిమాణిక్యం గ్రామాల్లో ప్రగతియాత్ర నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి ఓటు అభ్యర్థించారు. తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మహిళలు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. బొట్టుపెట్టి హారతిచ్చారు. సీఎం కేసీఆర్ పాలనలో మిర్యాలగూడ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే మరో మారు తనను ఆశీర్వదించాలని కోరారు.
ప్రజలు అధిక సంఖ్యలో కదిలి రావడంతో జన జాతరను తలపించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు గ్రామీణ ప్రజల ఇబ్బందులు తెలుసని అందుకే గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. టేలాండ్ భూముల సమస్య పరిష్కారం కోసం లిఫ్ట్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. లిఫ్టుల నిర్మాణం పూర్తయితే బాలెంపల్లి, మొల్కచర్ల, కొత్తూరు, ఉల్సాయిపాలెం, బంగారికుంటతండా, చింతచెట్టుతండా, ఇందిరానగర్, తాడిచెట్టుతండా గ్రామాల్లోని భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు.
అడవిదేవులపల్లిని కొత్తగా మండలంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సౌకర్యవంతంగా ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు రూ.358.78 కోట్లను వెచ్చించినట్లు చెప్పారు. దాంతో పాటు సంక్షేమ పథకాలకు రూ.223 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేస్తామన్నారు. దాంతో పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందనున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలంతా బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న తనను మరోమారు గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్ర సేవ్యానాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కూరాకుల చిన రామయ్య, మాజీ ఎంపీపీ కూరాకుల మంగమ్మ, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కొత్త మర్రెడ్డి, వైస్ ఎంపీపీ కూరాకుల మల్లీశ్వరీగోపీనాథ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎం. సూర్యనాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.