సంస్థాన్ నారాయణపురం, నవంబర్ 17 : మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గుజ్జ, మల్లారెడ్డిగూడెం, రాజన్నబావి, సర్వేల్, నారాయణపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. మరో మారు తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు కాంట్రాక్టులు లేవని, మునుగోడు నియోజకవర్గ ప్రజలతో నిత్యం కాంటక్ట్ అవుతూ వారి సంక్షేమానికి కృషి చేయడమే తన పని అన్నారు. మూడు గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధిలో వెనుకబడ్డ తెలంగాణ రాష్టాన్ని తొమ్మిదేండ్లలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు.
2014 నుంచి 2108 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, మధ్యలో కాంట్రక్టర్ ఎమ్మెల్యేగా గెలువడంతో అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. తిరిగి ఉప ఎన్నికలో తాను గెలుపొందాక నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ నిమోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.72 కోట్లతో సీసీ రోడ్లు , అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మున్సిపాలిటీకి రూ.80 కోట్ల నిధులు, గిరిజన భవనానికి రూ.2 కోట్లు, గిరిజన గురుకుల పాఠశాల, చండూరు రెవెన్యూ డివిజన్, చౌటుప్పల్లో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణానికి రూ.90 కోట్లు, రూ.136 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు.
దాంతో పాటు కాల్వలపై, చెరువులపై చెక్ డ్యాంలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రజల కనీస అవసరలను కూడా తీర్చలేక పోయాడన్నారు. తెలంగాణలో మళ్లీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనకు మరోమారు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
మండలంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రచారానికి వస్తున్నాడని తెలుసుకొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ శివారు నుంచి గ్రామంలోకి భారీ ర్యాలీ నిర్వహించారు. కోలాటాలు, డప్పులు, బోనాలు, బతుకమ్మలతో సాగిన ర్యాలీ ఆకట్టుకుంది. మహిళలు మంగళహారతి ఇచ్చి తిలకం దిద్ది ఆశీర్వదించారు.
సంస్థాన్ నారాయణపురం : తన స్వార్థ రాజకీయాలు, కాంట్రాక్టుల కోసం పూటకో పార్టీ మారే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజకీయ బ్రోకర్ అని బీఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి అన్నారు. మండల కేంద్రంలో ఎమెల్యే వెంట ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. 1800 కోట్ల కాంట్రక్ట్ కోసం కాంగ్రెస్ పార్టీని, మునుగోడు ప్రజలను తాకట్టు పెట్టిన ఆయన ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తిరిగి ప్రజల ముందుకు వస్తున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నపుంసకుల చేతిలో వెళ్లి పోయిందని విమర్శించారు. రాజగోపాల్రెడ్డికి దమ్ముంటే నియోజకవర్గంలో గల్లి గల్లీ తిరుగుదాం, ఆయన చేసిన ఒక్క అభివృద్ధి పనుల శిలాఫలకం చూపించాలని చాలెంజ్ చేశారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నాయకత్వంలోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి కూసుకుంట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్, మునుగాల నారాయణరావు, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతీగౌడ్, పీఏసీఏస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు లారీ భిక్షం, గంగాదేవీ సత్తయ్య, సర్పంచులు యాదిరెడ్డి, కొండా పద్మ, కట్టెల భిక్షపతి, సుర్వి యాదయ్య, ఎంపీటీసీలు ఈసం యాదయ్య, నర్రి పావని, నాయకులు జక్కడి ధన్వంత్రెడ్డి, బొడ్డుపల్లి గాలయ్య, బకారం వెంకటేషం, సురపల్లి వెంకటేశం, చింతల కృష్ణయ్య, రాసాల వెంకటేశం, ఎడ్ల సత్తయ్య పాల్గొన్నారు.
చౌటుప్పల్రూరల్ : మండలంలోని మల్కాపురం గ్రామంలోని ఆందోళ్ మైసమ్మ దేవాలయంలో బిఆర్ఎస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ప్రత్యేక పూజలు చేశారు.