నల్లగొండ, మార్చి 30 : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా సాగు నీరు లేదు. రైతు బంధు రాలేదు. ధాన్యానికి బోనస్ అందలేదు. పంటలు ఎండుతున్నా నష్ట పరిహారం ఇవ్వాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని రైతులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మొర పెట్టుకోవటంతో రైతులకు అండగా ఉండి భరోసా కల్పించేందుకు కేసీఆర్ రంగంలోకి దిగారు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆయన నడవలేని పరిస్థితుల్లో ఉన్నా రైతుల కోసం కర్ర సాయంతో ఉమ్మడి జిల్లాలో పర్యటించడానికి వస్తున్నారని తెలిపారు.
భువనగిరి, జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. శనివారం నల్లగొండలోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి క్యాంప్ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్ల వ్యామోహంలో పడి ప్రజా పాలనను గాలికి వదిలేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే సోయి లేకుండా పార్టీలో చేరికకు గేట్లు తెరుస్తామని మాట్లాడుతున్నారని, ముందు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలకు నీళ్లివ్వాలని అన్నారు.
నాడు సాగర్లో ఇంతకన్న తక్కువ స్థాయిలో నీళ్లున్నా అధికారుల సలహాతో జిల్లాలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కేసీఆర్ సర్కారు నీళ్లిచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నా పంటలు ఎండుతుంటే పట్టించుకోవడం లేదని, పోలీస్ పహారాలో 12 రోజుల పాటు పాలేరుకు నీటినా తరలిస్తే ఏంచేశారని ప్రశ్నించారు. పంతానికి పోయి నాటి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాళేశ్వరం ఆయకట్టుకు నీళ్లివడం లేదని మండిపడ్డారు.
మూడు నెలల్లో కాళేశ్వరం ద్వారా వంద టీఎంసీల నీరు తీసుకునే అవకాశం ఉన్నా సర్కార్ చేతగాని తనం వల్ల ఒక్క టీఎంసీ కూడా తీసుకోలేకపోయామని తెలిపారు. కనీసం రెండు తడులు ఇచ్చినా బయ్యన్నవాగు నుంచి మోతె వరకు ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదన్నారు. వ్యవసాయ రంగంపై సోయి లేని రేవంత్కు లోపల ఆదర్శం చంద్రబాబు అయితే బయట మోడీ అన్నారు. నాడు చంద్ర బాబు వ్యవసాయం దండగ అంటే, నేడు మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రజా వ్యతిరేకమైన పాలనను ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో సన్న ధాన్యం పండిస్తున్న రైతులు నష్టపోవద్దని ఏడెనిమిదేండ్ల నుంచి మిల్లర్లతో మాట్లాడి కింటాకు రూ.2,700 దాకా ధర ఇప్పిస్తే ఈసారి రూ.2,200కి మించి ఎందుకు ఇవ్వలేదని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. మిల్లర్లు, కాంట్రాక్టర్లు, క్రషర్లు, ఆఖరికి ఇంటి నిర్మాణాలు చేపడుతన్న వారి దగ్గరా అక్రమ వసూళ్లకు పాల్పడి రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మిల్లర్ల దగ్గర రెండు కోట్ల దాకా వసూలు చేస్తే రైతుకు ఎలా మంచి ధర ఇస్తారని ప్రశ్నించారు. తక్కువ ధర ఇచ్చిన మిల్లులను సీజ్ చేయాలని మంత్రి చెప్పినా ఇప్పటి వరకూ ఒక్క మిల్లూ సీజ్ కాలేదని పైగా ధాన్యం ధర వంద రూపాయలు తగ్గిందని ఎద్దేవా చేశారు.
ఎకరాకు రూ.25వేలు
పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మొదటి నుండి రైతుల పక్షానే ఉంటుందని, ఇవ్వాల బీఆర్ఎస్ అధికారంలో లేనందున రైతులకు అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా రైతులకు భరోసా ఇవ్వడానికి కేసీఆర్ వస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నేతలు తండు సైదులుగౌడ్, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మందడి రెడ్డి, చీర పంకజ్ యాదవ్, ఎడవెల్లి విజయేందర్రెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, బొమ్మరబోయిన నాగార్జున, జనార్దన్రావు, గోవర్దన్, కోటేశ్ పాల్గొన్నారు.