సూర్యాపేటటౌన్, డిసెంబర్ 25 : శాంతి, సహనాలకు క్రిస్మస్ ప్రతీక అని, ఏసుక్రీస్తు మహోన్నత క్షమాగుణ సంపన్నుడని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల జాలి, అవధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉన్న కరుణామయుడు ఏసుక్రీస్తు అన్నారు.
ఆయన బోధనలు అనుసరణీయమని తెలిపారు. సర్వ మతాల సమ్మేళనానికి తెలంగాణ రాష్ర్టాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. తొమ్మిదిన్నరేండ్ల పాలనలో శాంతి సామరస్యాలతో ఐక్యతను పెంపొందించారన్నారు. అన్ని వర్గాల ప్రజలు తనను మూడోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించారని, అందరి నమ్మకాన్ని నిలబెడుతూ సూర్యాపేటను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.
ఈ వేడుకల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాల సైదులు, ఆయా చర్చిల పాస్టర్లు సిల్వి, డాక్టర్ ప్రభుదాస్, సాల్మన్రాజు, నాయకులు అనుములపురి రవిబాబు, ఉప్పల ఆనంద్, పూర్ణ శశికాంత్, మద్ది శ్రీనివాస్యాదవ్, రమా కిరణ్, గుండపనేని కిరణ్ పాల్గొన్నారు.