నేరేడుచర్ల/ కోదాడ, ఏప్రిల్ 12 : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో బొంద పెట్టాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో శుక్రవారం నిర్వహించిన నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 60ఏండ్ల ఏండ్ల కాంగ్రెస్ పాలన పరాకాష్టకు ఎడారిగా మారిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కళకళలాడి దేశానికే అన్నపూర్ణగా మారిందన్నారు. అలాంటి జిల్లా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మళ్లీ ఎడారిగా మారుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండిపోతున్న పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉన్నప్పటికీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అన్నీ మూసుకొని కూర్చొని అసమర్థులుగా మిగిలిపోతున్నారన్నారు. నాడు చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రస్తుత ఇద్దరు మంత్రులు నోరు మూసుకున్నారని పేర్కొన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో 420 హామీలిచ్చి, వంద రోజుల్లోనే నెరవేర్చుతామన్న కాంగ్రెస్ పార్టీ 120 రోజులైనా ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎక్కడా ఎకరం పంట కూడా ఎండిపోలేదని, ఏ ఒక్క రైతూ చనిపోలేదని తెలిపారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుబంధు అందక చాలా మంది అప్పుల పాలయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏదైనా కారణాలతో రైతు చనిపోయిన 10 రోజుల్లోనే ఆ కుటుంబానికి రైతుబీమా కింద రూ.5లక్షలు అందేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీమా సొమ్ము చెల్లించకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న రెండు వందల రైతుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ధ్వజమెత్తారు. రూ.4వేల పింఛన్, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, రైతుబంధు పెంపు, మహిళలకు రూ.2500, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు చేయలేదో గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పునరావృతం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కష్టపడి సాధించుకొని అభివృద్ధి చేసుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి కరుణించక వచ్చిన కరువు కన్నా కాంగ్రెస్ పార్టీ ముందు చూపులేని విధానంతో తెచ్చిన కరువే ఎక్కువ అని విమర్శించారు. కేసీఆర్ హయాంలో సాగర్ డ్యామ్లో 508 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు కూడా పంటలకు నీరు అందించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 515 అడుగులకు పైగా నీళ్లు ఉన్నా సాగర్ నీటిని విడుదుల చేయకుండా పంటలను ఎండబెట్టిందని దుయ్యబట్టారు. సాగర్ నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు రెండు సార్లు తరలించుకుపోతుంటే ఇక్కడి మంత్రులు మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు.
రైతుల్లో ధైర్యం నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలిస్తే లాగులు తడిచిన ప్రభుత్వం వెంటనే నీటిని విడుదల చేసిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోతుందని మొత్తుకున్న ప్రభుత్వం తరువాత నీటిని ఎలా విడుదల చేసిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అబద్దాలతో పాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడే నాటికి 6గంటల విద్యుత్ అందేదని, రాష్ట్ర అప్పు రూ.22వేల కోట్లు ఉన్నదని, అది ఐదేండ్లకు రూ.44 వేల కోట్లు అయ్యిందని, మరో ఐదు సంవత్సరాలకు రూ.88వేల కోట్లకు చేరిందని తెలిపారు.
తాము 24 గంటల విద్యుత్ అందించామని, విద్యుత్ సంస్థల ఆస్తి లక్షా 40వేల కోట్లు ఉన్నదని చెప్పారు. డిసెంబర్ 9న ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ తొలి సంతకం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మిల్లర్లను బెదిరించి కోట్లాది రూపాయలు వసూలు చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఢిల్లీకి కప్పం కట్టాల్సిన పరిస్థితి ఉన్నదని ఆరోపించారు. బీజేపీ పాలనలో ధరలు విపరీతంగా పెరిగి ప్రజ లు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. తెలగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి 1200 మంది రైతుల మరణానికి కారణమైన బీజీపీకి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపునకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, భిక్షమయ్యగౌడ్, ఎంపీపీలు లకుమళ్ల జ్యోతి, పార్వతి, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, నాయకులు అప్పిరెడ్డి, రంగాచారి, ఆయా మండలాల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.