సూర్యాపేట టౌన్, మే 4 : నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో కక్షపూరిత వైఖరి, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలే వివరిస్తున్నారని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ హవా మళ్లీ మొదలైందని, కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం సూర్యాపేటలోని 60 ఫీట్ల రోడ్డులో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మోసాలు నాలుగు నెలల్లోనే బయటపడ్డాయని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల ముసుగులో మారోమారు మోసం చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక సీట్లు రావడం ఖాయమన్నారు. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకుడు సైతం బెదిరింపులకు పాల్పడుతూ.. సూర్యాపేట అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఏండ్లుగా జరుగని అభివృద్ధి కేవలం పదేండ్లలో బీఆర్ఎస్ చేసి చూపిందని గుర్తు చేశారు.
పదేండ్లలో జరిగిన సంచలనాత్మక అభివృద్ధిని కండ్లుండి చూడలేని కాంగ్రెస్ నాయుకలకు ప్రజలే అభివృద్ధిని వివరిస్తారన్నారు. వ్యవసాయం రంగంలోనూ దేశానికే నంబర్ వన్గా ఉమ్మడి నల్లగొండ నిలిచిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లాలో 3 మెడికల్ కళాశాలలు తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని, అవి కూడా అబద్ధమంటే కాంగ్రెస్ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేవలం నాలుగు నెలల్లో ఇంతటి వ్యతిరేకత ఏ పార్టీకి ఎదురు కాలేదని, కాంగ్రెస్ అతితక్కువ సమయంలోనే చతికిల పడ్డదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పథకాలనే కొనసాగిస్తూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్.. కొత్తగా ఏం చేసిందో ప్రజలకు వివరించి ఓట్లడగాలని సూచించారు.
దేశానికే అన్నం పెట్టిన తెలంగాణ రైతాంగాన్ని అప్పుల పాలు చేసిన రేవంత్కు పుట్టగతులుండవని, అన్నదాతలను ఏడిపించిన ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం నిలబడలేదని అన్నారు. రైతుబంధు రాలేదన్నోళ్లను చెప్పుతో కొట్టాలన్న వారిని ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. అధికారంలో ఉన్నామన్న సోయి లేకుం డా బీఆర్ఎస్, కేసీఆర్పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్న తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి రాంచందర్నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, ఆయా వార్డుల నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.