మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 14 : హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ సర్కారు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నదని.. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. మిర్యాలగూడ పట్టణంలోని నందిపాడ్ టీఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అధ్యక్షతన జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటుచూసినా ఎండిపోయిన పొలాలు, తాగునీటి సమస్యలతో రైతులు, ప్రజలు సతమతమవుతున్నా ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో, బయట కేసీఆర్ను, కేటీఆర్ను తిట్టడానికే తన పదవిని ఉపయోగిస్తున్నారన్నారు. 15రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ అని రాద్ధాంతం చేస్తూ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అంటున్నాడని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఏం చేసిందని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు రంగులు వేసి మరోసారి ప్రారంభించారే తప్ప రాష్ర్టానికి చేసిందేమీ లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నాయని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ప్రజలు నిజానిజాలు తెలుసుకొని ఎవరి పాలన ప్రజారంజకంగా సాగిందో వారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.
తమ ప్రభుత్వంలో నాగార్జునసాగర్లో నీటి మట్టం 505 అడుగుల డెడ్ స్టోరేజీలో ఉన్నా రైతుల క్షేమం కోరి సాగు నీటికి విడుదల చేశామని, 515 అడుగుల నీరు ఉన్నా కూడా కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేక చేతులెత్తేసిందని చెప్పారు. రైతులను కాపాడలేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంద అడుగుల లోతులో బొందపెట్టాలన్నారు. కాంగ్రెస్ మంత్రివర్గం రాష్ట్రంలోని ప్రతి రైస్ మిల్లు నుంచి రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లు బెదిరించి వసూలు చేసి ఢిల్లీకి పంపించిందని విమర్శించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, ఎంపీపీలు నూకల సరళాహన్మంతరెడ్డి, బాలూనాయక్, జడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ ఏఎంసీ చైర్మన్లు, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, మట్టపల్లి సైదులుయాదవ్, పాలుట్ల బాబయ్య, మాజీ ఎంపీపీ పేలప్రోలు తిరుపతమ్మ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వం 1.52 లక్షల ఎకరాలకు రైతుబంధు చెల్లించి రైతులను ఆదుకుంది. నేటి ప్రభుత్వం యాసంగి పంట చేతికొస్తున్నా 4 ఎకరాల లోపు వారికే మాత్రమే రైతుబంధు ఇచ్చి చేతులు దులుపుకుంది. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నన్ను పార్లమెంట్కు పంపిస్తే స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు పంటలకు గిట్టుబాటు ధర అమలయ్యేలా కృషి చేస్తా. రైతుబంధు సక్రమంగా అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా. ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండే పార్టీ బీఆర్ఎస్కు ఓటు వేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి.
– కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి
గత ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప కాంగ్రెస్ సర్కారు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద సాగు చేసిన వరి పొలాలు నీళ్లు అందక కండ్ల ముందే ఎండిపోతున్నా స్థానిక ఎమ్మెల్యేగానీ, జిల్లా మంత్రులుగానీ స్పందించలేదు. రేయింబవళ్లు కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధరను మిల్లర్ల నుంచి ఇప్పించలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వంలో యాదవులు రెండో విడుత గొర్రెల పంపిణీకి డీడీలు చెల్లించారని, వాటికి గొర్రెల యూనిట్లు ఇవ్వడం లేదని, డీడీలైనా తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులు కోరినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం మా చేతిలో లేకున్నా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తాం. రైతులకు అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేలా బీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలి.
-నల్లమోతు భాస్కర్రావు, మాజీ ఎమ్మెల్యే
గత శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఎకరాకు రూ.15వేలు, కల్యాణలక్ష్మి రూ.లక్షతోపాటు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామని, ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది. గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇచ్చింది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. గిరిజన జాతిని అక్కున చేర్చుకొని గౌరవించిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలి.
-బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్
125 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపించింది. ఇలాంటి పాలనపై ప్రజలు స్పందించాలి. రైతులు, ప్రజా సంక్షేమం కోరే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలను గెలిపించాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల మాయమాటల్లో పడి ప్రజలు మోసం పోయారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలకు ఇప్పుడు పూర్తిగా అవగాహన వచ్చింది. ఈ ప్రభుత్వం మాకొద్దు బాబోయే అంటూ మొరపెట్టుకుంటున్నారు. ప్రజలు నిజాలు గ్రహించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలి.
-బడుగుల లింగయ్యయాదవ్, మాజీ రాజ్యసభ సభ్యుడు
కాంగ్రెస్ అధికారం చేపట్టిన ఆనతికాలంలోనే రాష్ట్రంలోని రైస్ మిల్లులపై పడి వందల కోట్లు దోచుకున్నది. మంత్రివర్గం దోపిడీ దొంగలుగా మారారు. రైతుల సమస్యల పట్ల సీఎం స్పందించకుండా వంద రోజుల పాలనలో 21సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఐపీఎల్ మ్యాచ్ చూశారు. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా రేవంత్రెడ్డి దున్నపోతుపై వాన పడ్డ చందంగా ప్రవర్తిస్తున్నారు. గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని ప్రజలు గ్రహించాలని, ప్రజల యోగ క్షేమం కోరిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి.
– మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి