నాగారం, అక్టోబర్ 25 : ఉమ్మడి పాలకుల పాలనలో వెనుకబడిన తుంగతుర్తి నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కేవలం పదేండ్ల వ్యవధిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నర్సింహులగూడెం ఆవాసం దుబ్బతండా, పేరబోయినగూడెం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు ఇచ్చి విజయ తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా రికార్డ్ నెలకొల్పుతారన్నారు. రానున్న రోజుల్లో సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు పింఛన్ ఇవ్వనున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచినప్పటికీ సిలిండర్ను రూ.400కే అందిస్తామని తెలిపారు. బతుకమ్మ సంబురాలకు చెన్నై నగరానికి వెళ్లగా జీవనోపాధి కోసం నియోజక వర్గం నుంచి అక్కడికి వెళ్లిన దాదాపు వెయ్యి మందిని కలువడం జరిగిందని, వారందరిని తిరిగి రావాలని కోరినట్లు వెల్లడించారు.
పేరబోయినగూడెం, నర్సింహులగూడెం గ్రామాల్లో ఎన్నికల అనంతరం సీసీ రోడ్లు వేయిస్తానని హామీ ఇచ్చారు. నర్సింహులగూడెంలో వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తానన్నారు. రాష్ట్రంలో భూమి ఉన్నా లేకపోయినా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి మరణిస్తే రూ.5 లక్షల బీమా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కూరం మణీవెంకన్న, తిరుమలగిరి మార్కెట్ వైస్ చైర్మన్ రామ్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, ఉపాధ్యక్షుడు దోమల బాలమల్లు, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్ గుండగాని అంబయ్య, ఎంపీటీసీ వడ్డె పరశురాములు, సర్పంచులు తీగుళ్ల స్వరూపాప్రశాంత్, ధరావత్ గణేశ్, తరాల ఆంజనేయులు, కిరణ్, సైదు లు, ప్రేమయ్య, రామ్మూర్తి, వెంకన్న, సత్తయ్య, ముకుందరెడ్డి, సోమని పాల్గొన్నారు.