మద్దిరాల, అక్టోబర్ 26 : రాష్ర్టాన్ని అభివృద్ధి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలువాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని గోరెంట్ల, చౌవుల్లతండా, పోలుమల్ల గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గులాబీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలుకగా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెప్పినవి, చెప్పనివి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి, తమకు మాత్రమే ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉన్నదన్నారు. 2014, 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పినవే కాకుండా ప్రజలకు అవసరమైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలను అందించడం జరిగిందన్నారు.
రాష్ర్టాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో సీఎం కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదన్నారు. నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా ప్రతీ ఒక్కరినీ ఆదుకున్న చరిత్ర తమదన్నారు. ఈ ప్రాంత ప్రజలు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండేందుకు నియోజకవర్గంలోనే వంద పడకల ఆస్పత్రిని రూ.45 కోట్లతో మంజూరు చేయించి నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. బీళ్లుగా మారిన ఈ ప్రాంత భూములకు నేడు రెండు పంటలకు సాగునీళ్లు ఇస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా తనకే దక్కిందన్నారు.
రైతు బంధు ద్వారా పంట పెట్టుబడి అందిస్తూ, పండించిన పంటను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలువాల్సిన సమయం ఆసన్నమైందన్నారు నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ ఎస్ఏ రజాక్, వైస్ ఎంపీపీ బెజ్జంకి శ్రీరామ్రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ దామెర్ల వెంక న్న, ఎంపీటీసీ శిరంశెట్టి వెంకన్న, ఏలేటి ఉమామల్లారెడ్డి, జిల్లా నాయకులు మల్లు కపోతంరెడ్డి, ఆకుల ఉప్పలయ్యగౌడ్, తొనుకునూరి లక్ష్మణ్, పాతూరి లింగారెడ్డి, బద్దం సంజీవరెడ్డి, పాలబిందెల శ్రీనివాస్, వెంకట్రెడ్డి, వడ్డాణం మధుసూదన్, బీఎస్ ముదిరాజ్, మల్యాల నర్సయ్య పాల్గొన్నారు.