నార్కట్పల్లి నవంబర్ 17: మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బు అహంకారంతో పూర్తిస్థాయిలో మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని రామన్నపేట నుంచి కేతేపల్లి వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తొక్కుకుంటూ వెళ్తాననడం సరైంది కాదన్నారు. రోడ్డుపైనే కార్యకర్తలు ఉంటారని దమ్ముంటే తొక్కుకుంటూ వెళ్లాలని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సవాల్ విసిరారు. హత్యలు చేసే వ్యక్తులను తమ పక్కన పెట్టకొని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో కోమటిరెడ్డి సోదరులు హుందా తనాన్ని మరిచారని, ఈ ఎన్నికల్లో ఓటమి పాలైతే ఏమైపోతా మోనాని భయం పట్టుకుందన్నారు.
రాజగోపా ల్రెడ్డికి మునుగోడులో గెలిచే సత్తాలేదన్నారు. రూ. 18 వేల కోట్లకు బీజేపీకి అమ్ముడు పోయాడన్నారు. జిల్లాలో చాలా మంది రాజకీయ జీవితాన్ని ఆగం చేసిన చరిత్ర కోమటిరెడ్డి బ్రదర్స్ది అని అవసరం ఉన్నటప్పుడు ఒకలా అవసరం తీరాక మరోలా మాట్లాడే చరిత్ర వారిది అని అన్నారు. డబ్బులు పంచి జేజేలు కొట్టించుకోవడం వారికి మొదటి నుంచి అలవాటని అన్నారు. తాను పార్టీ మారడానికి గల కారణం నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు. మర్డర్లు చేసే వ్యక్తి పార్టీలోకి వస్తే బలం వచ్చిందని అనడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఓడిపాయారనే విషయం తేటతెల్లమైందని అన్నారు.
నల్లగొండ, మునుగోడు ప్రజలు మీకు చుక్కలు చూపించి మూడు చెరువుల నీరు తాపించడం ఖాయమన్నారు. పేదోడి ఎదుగుదల చూసి ఓర్వలేని మనస్తత్వం రాజగోపాల్ రెడ్డిదని అన్నారు. ఓట్ల పండుగకు ఊర్లలోకి వచ్చే పొలిటికల్ టూరిస్ట్లు కోమటిరెడ్డి బ్రదర్స్ అని అన్నారు. జీవితంలో గెలుపోటములు చాలా చూశామని మీ బెదిరింపులకు భయపడేది మాత్ర లేదని అన్నారు. రాజగోపాల్రెడ్డి అహంకారానికి మునుగోడులో భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది మల్లయ్య పాల్గొన్నారు.