కోదాడ, జూన్ 5 : విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలో సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రా వలస పాలనలో నిత్యం విద్యుత్ కోతలతో ప్రజలు, వ్యవసాయదారులు ఇబ్బందుల పాలయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకటిమయం అవుతుందని వలస పాలకులు విమర్శలు చేశారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో రెప్పపాటు కూడా విద్యుత్కు అంతరాయం లేకుండా ఉన్నదని తెలిపారు. విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలతో పారిశ్రామిక రంగం అభివృద్ధి జరిగిందన్నారు. వ్యవసాయదారులకు, పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీలు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో రెండున్నర కోట్లతో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశామని, బాలాజీనగర్లో కోటి రూపాయలతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటైందని తెలిపారు. ఉచిత విద్యుత్తో రైతాంగం మూడు పంటలు పండిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నదనన్నారు. కోదాడ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న 33/11 కేవీ లైన్ను మంత్రి జగదీశ్రెడ్డి సహాయంతో తొలగించడంతో స్థానిక ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్, ఆర్డీఓ కిశోర్కుమార్, కోదాడ, అనంతగిరి ఎంపీపీలు కవిత, వెంటేశ్వర్లు, విద్యుత్ డీఈ నిమ్మ వెంకటకృష్ణయ్య, ఏఈ మల్లెల శ్రీనివాస్, కమిషనర్ మహేశ్వర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మామధుసూదన్, నాయకులు సుంకర అజయ్కుమార్, సత్యంబాబు, నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.