కోదాడ, నవంబర్ 27 : 18ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అవినాభావ సంబంధం ఉందని.. కష్టనష్టాల్లో భాగస్వామ్యం అయ్యానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. అవకాశం ఉన్నంత మేరకు చేతనైనంత సాయం చేశానని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందానని పేర్కొన్నారు. ఈ నెల 30న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలో అత్యధిక మెజార్టీతో నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించి సరిహద్దు నుంచే బీఆర్ఎస్ విజయపరంపర కొనసాగుతుందని బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ప్రత్యేకంగా నమస్తే తెలంగాణతో కొద్దిసేపు ముచ్చటించారు.
ఆయన మాటల్లోనే.. 18ఏండ్లుగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న నాయకుడు కావాలో… టూరిస్టులా వచ్చే వెళ్లే నాయకురాలు కావాలో ప్రజలే తేల్చుకోవాలి. ప్రజల మద్దతు కోల్పోయి చేసేది లేక డబ్బు సంచులతో ఓట్లను కొనుగోలు చేసేందుకు జరుగుతున్న కుతంత్రాన్ని ప్రజలు తిప్పికొట్టాలి. మూడున్నర దశాబ్దాలుగా చీకటి ఒప్పందంతో కోదాడ తమ పట్టా భూమిలా గెలిచినా, ఓడినా మనమిద్దరమేనని మూడో వ్యక్తిని వస్తే ఓడించడమేనని ప్రత్యక్షంగా నిరూపించిన నేతల ద్వయానికి ఈ ఎన్నికల్లో ప్రజల నుంచి చీత్కారం తప్పదు. అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయి.
నియోజకవర్గంలోని 2.41లక్షల ఓటర్లలో 1.40లక్షల మంది సంక్షేమ పథకాల లబ్ధిదారులు సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నరు. జనాభాలో 80శాతం ప్రతినిధిగా నేను ఎన్నికల బరిలో నిలుస్తున్నందున.. నాపై చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలి. 2018లో గెలిచిన నాటి నుంచి రూ.2400కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసినందున మరోసారి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.