చిలుకూరు, మార్చి16 : బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తేనున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బేతవోలు గ్రామంలో నిర్వహించిన మండల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. గడపగడపకూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా అండగా ఉంటామని హామీనిచ్చారు. బీఆర్ఎస్ ప్రజల పార్టీ, ప్రజా సంక్షేమ పార్టీ అని పేర్కొన్నారు. పార్టీ కన్నతల్లి లాంటిదని, కష్టపడ్డ వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.
గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్
తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అభివృద్ధి పథంలో నడిపించిన సీఎం కేసీఆర్ దేశంలో గుణాత్మక మార్పు కోసమే జాతీయ రాజకీయాల్లోకి వచ్చారని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ అన్నారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం విప్లవాత్మక పంథాను అనుసరించారో.. నేడు దేశహితం కోసం నూతన రాజకీయ ఒరవడిని ప్రారంభించారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సంక్షేమ, ప్రగతి విధానాలు బీఆర్ఎస్ వేదికగా భవిష్యత్లో దేశం మొత్తానికి అమలు చేస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్కు పూర్తిస్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలతో సీఎం కేసీఆర్ చర్చలు జరపగా వారంతా ఆయన ఆలోచనతో ఏకీభవించారని తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రమాద బీమా చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొండా సైదయ్య, ప్రధాన కార్యదర్శి నలబోలు శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు సురేశ్, మాజీ ఎంపీపీ బజ్జూరి వెంకట్రెడ్డి, మాజీ జడ్పీసీ బట్టు శివాజీ, సొసైటీ చైర్మన్ జనార్దన్, సైదులు, వైస్ చైర్మన్ జానకీరామారావు, బేతవోలు గ్రామ శాఖ అధ్యక్షుడు తల్లూరి శ్రీనివాస్, నాయకులు కస్తూరి నర్సయ్య, కడియాల వెంకటేశ్వర్లు, అచ్చయ్య, బాదె ఆంజనేయులు, గన్న అశోక్, కొవ్వూరి వెంకటేశ్వర్లు, గంట శ్రీను, రాంరెడ్డి, అనంత వెంకటయ్య, యాగ్గది రామారావు, శంకర్ మేస్త్రి, ఉపేందర్రావు, వాసు, రంగయ్య, ములుగురి నాగరాజు, ప్రసాద్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.