కోదాడటౌన్, నవంబర్ 23 : గులాబీ జెండ.. నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని బీఆర్ఎస్ కోదాడ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. గురువారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. ఐదేండ్లుగా తాను చేసిన అభివృద్ధి మీ కండ్ల ముందు కనిపిస్తున్నదన్నారు. కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మితే ఆగమవుతామని పేర్కొన్నారు.
మళ్లీ తాము అధికారంలోకొచ్చాక ప్రతి ఇంటికీ కేసీఆర్ బీమా కింద 5లక్షల బీమా, రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.3వేల భృతి ఇస్తామని తెలిపారు. ఐదేండ్లలో కోదాడ పట్టణంతో పాటు పల్లెల్లో ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు నిర్మించామని, మన బస్తీ మన బడి పేరుతో పట్టణంలోని బాలాజీనగర్, సాలార్జంగ్ పేట, బంజరకాలనీ, బాలుర ఉన్నత పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. కోటి రూపాయలతో బాలాజీనగర్లో వైకుంఠధామాన్ని నిర్మించామని తెలిపారు. పగటి పూటను తలపించేలా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు.
పట్టణ ప్రకృతి వనాలు, పార్కులు, కోట్ల రూపాలయలతో డ్రైనేజీలు, సీసీ రోడ్లను ఏర్పాటు చేశామని, ఇవి కాక మరెన్నో నిధులతో కోదాడ పట్టణ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో శుభకార్యమైన, అశుభకార్యమైన వచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా… తాను హాజరైనట్లు తెలిపారు. మీ కంటి ముందు అభివృద్ధిని చూసి ఓటేయాలని, రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
రాజకీయాల్లో మాట మీద నిలబడేవారు అరుదుగా ఉంటారని, కోదాడ దశ, దిశ మార్చిన ఘనత ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్కే దక్కుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ బడగుల లింగయ్య యాదవ్ అన్నారు. నాలుగేండ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వేల కోట్ల నిధులతో రహదారులు, డ్రైన్లు, బ్రిడ్జిలు, సెంట్రల్ లైటింగ్, మున్సిపాలిటీల్లో డివైడర్లు, మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు ఇండ్ల పట్టాలతో పాటు, 600మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు పంచారని తెలిపారు.
కోదాడలోని ప్రభుత్వ ఆస్పత్రిని 30నుంచి 100 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అనుమతులు తీసుకువచ్చిన ఘనత మల్లయ్యదేనని కొనియాడారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమకు మరోసారి పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ వెంపటి పద్మామధుసూదన్, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు కట్టెబోయిన జ్యోతీ శ్రీనివాస్యాదవ్, తిపిరిశెట్టి సుశీలారాజు, నాయకులు చల్లా ప్రకాశ్, ఆలేటి సత్యనారాయణ, యాద సుధాకర్, నరేశ్, సత్యనారాయణ, వంశీ పాల్గొన్నారు.