నడిగూడెం, నవంబర్ 10 : తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేండ్లలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, దాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మండలంలోని వల్లాపురం, సిరిపురం, కోడిపుంజులగూడెం, కాగిత రామచంద్రాపురం, కరివిరాల గ్రామాల్లో పర్యటించారు. గ్రామగ్రామాన ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్కు ప్రజలు బతుకమ్మలు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, పరుగులు పెడుతున్న అభివృద్ధికి సీఎం కేసీఆరే గ్యారెంటీ అని పేర్కొన్నారు. ఎలాంటి గ్యారెంటీలు లేని కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోద్దని ప్రజలకు సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం అన్ని రకాల మౌలిక వసతులతో కళకళలాడుతున్నాయన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూసి బీఆర్ఎస్కు ఓటెయ్యాలని కోరారు. 600 ఎకరాలు ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు డబ్బులు తీసుకోలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతు బంధును ఆపాలని ఫిర్యాదు చేయడం ఎంత వరకు సబబని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెద్దలమని చెప్పుకునే నాయలంతా ఒకచోట చేరి బీఆర్ఎస్ను విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు.
కొత్త బిచ్చగాళ్లులా గ్రామాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులకు ఇన్ని రోజులు గుర్తుకు రాని ప్రజలు ఎన్నికలు రాగానే గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఈ నాయకులంతా ఎక్కడికి పోయారన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. నియోజకవర్గం ఆయకట్టు పరిధి కావడంతో వానకాలం పొలాలు ఎండిపోతున్నాయని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడంతో సాగర్ డెడ్స్టోరేజీలో ఉన్నా రైతుల కోసం 15రోజులు నీటి విడుదల చేశామన్నారు. సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాగానే ప్రతి గ్రామంలో ఇండ్లు లేని వారికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కట్టిస్తామన్నారు.
వల్లాపురంలో రైతుల ఇబ్బంది తొలగించేందుకు రూ.40లక్షలతో గోదాం నిర్మిస్తున్నామని, త్వరలోనే ప్రారంభించుకుందామని తెలిపారు. ఎప్పుడు మీ వెంటే ఉండే నాయకుడిని గుర్తించి ఓటేయాలని కోరారు. ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రచారం చేసి మండలంలో అత్యధిక మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు, పార్టీ మండలాధ్యక్షుడు పల్లా నర్సిరెడ్డి, దేవబత్తిని సురేశ్ప్రసాద్, దేవబత్తిని వెంకటనర్సయ్య, పాలడుగు ప్రసాద్, కాసాని వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ గోసుల రాజేశ్, అనంతుల ఆంజనేయులు, అనంతుల మహేశ్, ఖలీల్ అహ్మద్, బోనగిరి ఉపేందర్, సర్పంచులు వట్టికూటి చంద్రయ్య, నాగేందర్రెడ్డి, ఈదయ్య, మొక్కా రామయ్య, నాగేందర్, నాగేశ్వరరావు పాల్గొన్నారు.
– కోదాడ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి శశిధర్రెడ్డి
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జి కన్మంతరెడ్డి శశిధర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో చూసినప్పుడు అధ్వాన స్థితిలో ఉన్న గ్రామాలు ప్రస్తుతం అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. మీ మండల అభ్యర్థి మల్లన్నకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ తేవాలని కోరారు. ప్రతి పక్షాల పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.