ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధానమైన ఫ్లోరైడ్ సమస్యను రూపుమాపాలన్న ఆలోచనతోనే ఇంటింటికీ సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. లక్ష్యం మేరకు వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ట్యాంకులు, పైపులైన్లు పెద్ద ఎత్తున నిర్మించి గడపగడపకూ మంచినీటిని అందిస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ కోసం కృష్ణా నది నీటిని వినియోగిస్తుండగా తిరుమలగిరి మండలానికి మాత్రం కాళేశ్వరం జలాలు ఇస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిషన్ భగరథ నీరు అందుతున్న తొలి మండలం ఇదే. గతంలో జనగాం జిల్లాలోని సింగరాజుపల్లి నుంచి వచ్చే పైప్లైన్ ద్వారా నీటిని అందించగా ఈ ఏడాది మార్చి నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్ మంగోల్ నుంచి సరఫరా చేస్తున్నారు. సమైక్య పాలనలో తాగునీటి కోసం ఇక్కడి ప్రజలు ఎన్నో తంటాలు పడ్డారు. బిక్కేరు వాగులో చెలిమలు తీసి, వ్యవసాయ బావుల వద్దకు క్యూ కట్టి నీరు తెచ్చుకునేది. ఇప్పుడు ఇంటికే కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి. మండలంలోని సుమారు 12 వేల ఇండ్లలోని 38,804 మంది ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు.
తిరుమలగిరి, జూలై 6 : సూర్యాపేట తిరుమలగిరి మండలంలో 2014కు ముందు తాగునీరు అందక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి గ్రామం అయిన తాటిపాముల ప్రజలు తాగునీటి కోసం బిక్కేరు వాగులో చెలిమలు తీసేది. మండలంలోని రామునిబండ తండా, రాజానాయక్ తండా వంటి ఆవాసాల్లో తాగునీరు దొరుకని పరిస్థ్దితి. ఈ కారణంతో ఆయా ఆవాసాల యువకులకు అమ్మాయిని ఇచ్చేందుకు తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయి. స్వరాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా మారింది. సమస్యను పరిష్కరించి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా సూర్యాపేట జిల్లాలో కాళేశ్వరం మొట్టమొదటి ఫలితం తిరుమలగిరి మండలానికి లభించింది. ఇప్పుడు తిరుమలగిరి మండలంలో ఇంటింటికీ నల్లాల ద్వారా నిత్యం 100 లీటర్ల తాగునీరు అందుతుంది.
రూ.1,623 కోట్లతో పైపులైన్ నిర్మాణం
కొమురవెల్లి ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను హైదరాబాద్ వెళ్లే పైపులైన్ నుంచి కనెక్షన్ తీసుకొని జనగాం జిల్లాలోని సింగరాజుపల్లి గ్రామానికి మళ్లించారు. అక్కడి నుంచి తిరుమలగిరి గుట్టపై నిర్మించిన ట్యాంకులోకి నీటిని నింపారు. ఆ నుంచి పలు గ్రామాలకు సరఫరా అవుతున్నది. జిల్లాలో కాళేశ్వరం మొదటి ఫలితం మిషన్ భగీరథ ద్వారా తిరుమలగిరికి అందింది. ఇందుకోసం 52 ఆవాసాలకు 68కిలోమీటర్ల మేర పైప్లైన్ పూర్తిచేశారు. 61 ఓవర్ హెడ్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం తాగునీటి సమస్య తీరింది.
కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ తాగునీరు
మార్చి రెండో వారం నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్ వద్ద ఉన్న మంగోల్ గ్రామంలోని నీటి శుద్ధి కేంద్రం నుంచి సిద్దిపేట, జనగాం, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లాకు తాగునీటి పైప్లైన్ కనెక్షన్ ఇచ్చారు. దీంతో కాళేశ్వరం జలాలు నేరుగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా వస్తుండడంతో ఇక కరువు పరిస్థితులు వచ్చినా తాగునీరు పుష్కలంగా అందనుంది. తిరుమలగిరి మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లోని 5,935 గృహాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతుంది. దీంతో మండలంలోని 20,334 మంది ప్రజల దాహర్తి తీరుతున్నది. అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీలోని సుమారు 6వేల ఇండ్లకు, 18,474 మంది ప్రజలకు కాళేశ్వరం జలాలను తాగునీరుగా అందిస్తున్నారు.
మొదటిసారి నల్లా నీళ్లు చూస్తున్నాం
గతంలో తాగడానికి నీళ్లులేక ఫ్లోరైడ్ పడి ఇబ్బందులు ఎదుర్కొ బోర్ల దగ్గరి నుంచి నీళ్లు తెచ్చుకున్నాం. వచ్చిరాని కరెంట్తో తాగునీటి కోసం జాగారం చేసి పాములు, తేళ్లు కుట్టినా పొలాల కాడికి పోయి నీళ్లు తెచ్చుకునేది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా మొండిచింత తండా గ్రామపంచాయతీగా ఏర్పాటైంది. ఇన్నేండ్లలో మొదటిసారిగా మిషన్ భగీరథ ద్వారా ఇంటికే నల్లాల ద్వారా తాగునీరు ఇవ్వడం చూస్తున్నాం. ప్రభుత్వం అడగకుండానే తండాకు పైపులైన్ ఏర్పాటు చేసి ఇంటికి రోజూ 100 లీటర్ల తాగునీరు అందించడం గొప్ప విషయం. నల్లాల ద్వారా మా ఆవాసానికి తాగునీరు అందుతుందని కలలో కూడా ఊహించలేదు. సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
– లావుడియా జమిలీ, మొండిచింత తండా, తిరుమలగిరి మండలం
అప్పట్లో వాగులు, చెలిమెల్లో నీళ్ల కోసం అవస్థలు పడ్డాం
తెలంగాణ ఏర్పాటుకు ముందు వేసవి వచ్చిందంటే చచ్చిబతికేవాళ్లం. బిందెడు నీళ్ల కోసం బిక్కేరు వాగులో గంటల తరబడి చెలిమెలు తీసేది. రాత్రి వేళ కిలోమీటర్ల మేర వెళ్లి వ్యవసాయ బావుల వద్ద నీళ్లు తెచ్చుకునే పరిస్థితి. ఉదయం పూట కరెంట్ లేక అర్ధరాత్రి రెండు, మూడు గంటలకు వస్తే నిద్రలేక వ్యవసాయ బావుల వద్దకు పరిగెత్తేవాళ్లం. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ కృషితో నల్లా ద్వారా మిషన్ భగీరథ తాగునీరు అందుతుంది.
– కందుకూరి కాంతయ్య, తాటిపాముల, తిరుమలగిరి మండలం