మిర్యాలగూడ, మే 4 : కోట్ల రూపాయల విలువైన చెరువు శిఖం భూమిని కొందరు స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములతోపాటు చెరువు శిఖం భూములను సైతం అడ్డూఅదుపు లేకుండా కబ్జా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఓ అధికారికి ఆక్రమించిన చెరువు శిఖం భూమిలో ఏకంగా 6 గుంటల భూమిని తాయిలంగా ఇవ్వడంతో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మిర్యాలగూడ నుంచి నల్లగొండకు వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న పందిళ్లపల్లి చెరువు శిఖం యాద్గార్పల్లి శివారులో సర్వే నంబర్ 32, మిర్యాలగూడ శివారులోని సర్వే నంబర్ 118లో సుమారు 480 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఇప్పటికే సగానికి పైగా కబ్జాకు గురైంది. గత ప్రభుత్వ హయాంలో రామచంద్రగూడెం నుంచి యాద్గార్పల్లి బోటింగ్ పార్క్ వరకు నెక్లెస్ రోడ్డు ఏర్పాటుకు రూ.7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రోడ్డు వేసేందుకు చెరువు శిఖం భూమి నుంచి రహదారి వేయడంతోపాటు మట్టిని పోసి రోడ్డు నిర్మాణం చేశారు. తీరా సీసీ రోడ్డు వేసే క్రమంలో ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి.
నెక్లెస్ రోడ్డు వెంట చెరువు శిఖం భూములు ఉన్నాయి. ప్రధానంగా ఉమామహేశ్వర స్వామి ఆలయం వెనుక సుమారు 1.5 ఎకరాల శిఖం భూమి ఉండగా ప్రస్తుతం తీవ్రమైన ఎండలతో భూగర్భజలాలు అడుగంటి చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో దాన్ని ఆనుకొని ఉన్న నివాస గృహాల వారు వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే ఆ భూమిని కబ్జా చేసేందుకు చుట్టూ కంచె వేస్తున్నారు.
ఆ చెరువులో ఉన్న మట్టిని తవ్వి చెరువు శిఖం భూమిలో పోసి చదును చేస్తున్నారు. భూమి తమదే అనిపించుకునేందుకు హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తతంగమంతా వారం రోజులుగా సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖాధికారికి ఆ చెరువు శిఖం భూమిలో ఆరు గుంటలను తాయిలంగా ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెరువు శిఖం భూమి ఆక్రమణ విషయంపై ఇరిగేషన్ డీఈ జనార్దన్ను వివరణ కోరగా కబ్జా అవుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. చాలా వరకు చెరువు శిఖం భూమి కబ్జా అవుతున్నదని తెలిసిందని, ఆ భూమిని కాపాడేందుకు సర్వే చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించినట్లు చెప్పారు. సర్వే పూర్తయ్యాక హద్దులు నిర్ణయించి చెరువు చుట్టూ కంచె వేసి భూమి కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
చెరువు శిఖం భూమి ఆక్రమణ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి అనుమతి మేరకు భూములను కాపాడేందుకు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం.
-విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ
మిర్యాలగూడ : ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మైనింగ్ ఏడీ జాకబ్ అన్నారు. శనివారం పట్టణ శివారులోని పందిళ్లపల్లి చెరువులో మట్టి తరలింపును ఆయన పరిశీలించి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కొందరు అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు.
ఈ చెరువులో ఒక హెక్టార్ భూమికి మాత్రమే అనుమతి ఉందని, ఎంతమేరకు తవ్వారన్న దానిపై విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తే రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు జరిమానా విధించడంతోపాటు ట్రాక్టర్లు, జేసీబీలను సీజ్ చేస్తామన్నారు. ఇప్పటికే దామరచర్ల, తడకమళ్ల, వేములపల్లి మండలాల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న దానిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఆయన వెంట ఏజీ బాలు ఉన్నారు.
– మైనింగ్ ఏడీ జాకబ్