మిర్యాలగూడ, జనవరి 27 : మిర్యాలగూడ పట్టణాభివృద్ధికి తిరునగరు గంగాధర్ పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, మాజీ సైనికుడు దివంగత తిరునగరు గంగాధర్ 4వ వర్ధంతిని శనివారం పట్టణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్చౌక్ వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భాస్కర్రావు వేర్వేరుగా పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో అనేక అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల ఆదరాభిమానులను చూరగొన్న గొప్ప నాయకుడు గంగాధర్ అని ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్, రాష్ట్ర ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మెరుగు రోశయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, నాయకులు ధీరావత్ స్కైలాబ్నాయక్, మగ్దూంపాషా, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.