సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి కృషితో తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ ఫర్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఐటీ జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. సూర్యాపేట జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది ఉద్యోగార్థులు తరలిరావడంతో జాబ్ మేళా ప్రాంగణం కిటకిటలాడింది. మంత్రి జగదీశ్రెడ్డి జాబ్మేళాను ప్రారంభించి ఉద్యోగార్థులతోపాటు, ఆయా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. రిక్రూట్మెంట్కు 15 కంపెనీలు హాజరు కాగా దాదాపు 4 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు. తొలి విడుతలో 390 మందిని సెలెక్ట్ చేయగా ఇందులో 75 మందికి ఉద్యోగాలు కన్ఫర్మ్ అయ్యాయి. ఉద్యోగాలు వచ్చిన వారికి అక్టోబర్ 2న ఐటీ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. జాబ్మేళాకు వచ్చిన ఉద్యోగార్థులకు ఇబ్బంది లేకుండా మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం భోజనంతోపాటు వసతులు కల్పించింది.
– సూర్యాపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ)
సూర్యాపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన ఐటీ జాబ్మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తల్లిదండ్రులతో కలిసి అభ్యర్థులు వేలాదిగా తరలి రావడంతో జాబ్మేళా ప్రాంగణమంతా కిటకిటలాడింది. పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్లో ముందస్తుగానే ఆయా ఐటీ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేయగా సోమవారం నాటికి రిజిస్ట్రేషన్ చేసుకున్న దాదాపు 4 వేల మంది అభ్యర్థులు తమ డాక్యుమెంట్లతో చేరుకున్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించి ఆయా కంపెనీల ప్రతినిధులు, హాజరైన ఉద్యోగార్థులతో మాట్లాడారు. అనంతరం ఐటీ హబ్లో ఉద్యోగాల కల్పనకు తొలి దశలో 15 కంపెనీలు రాగా, ఎక్కువగా బీటెక్, ఎంబీఏ, డిగ్రీ పూర్తి చేసినవారు పోటీ పడ్డారు. ఎంపిక ప్రక్రియలో ఐటీ కంపెనీలు మూడు అంచెల విధానాన్ని అమలు చేస్తూ వివిధ విభాగాల్లో పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియను ప్రారంభించారు. తొలి దశలో ఆయా కంపెనీల నుంచి 390 మంది ఎంపికయ్యారు. వీరిలో 75 మందికి ఉద్యోగాలు కన్ఫామ్ చేశారు. మిగిలిన 315 మందికి త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వనున్నారు. అక్టోబర్ 2న మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి ఐటీ హబ్ను ప్రారంభించి అదే రోజున ఉద్యోగాలు పొందిన 75 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఉద్యోగార్థులకు ఇబ్బంది కలుగకుండా మంత్రి జగదీశ్రెడ్డి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం భోజనంతోపాటు మౌలిక వసతులు కల్పించారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : వచ్చే ఐదేండ్లలో సూర్యాపేటకు 50 ఐటీ కంపెనీలు తీసుకురావడం, ఇక్కడి యువతకు 5 వేల ఉద్యోగాలు కల్పించడమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో త్వరలో ప్రారంభం కానున్న ఐటీ హబ్కు గానూ టాస్క్ ఆధ్వర్యలో ఐటీ కంపెనీలు నిర్వహించిన జాబ్మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉద్యోగ మేళాను ప్రారంభించి ప్రసంగించారు. 2018లో ఎన్నికల ప్రచారంలో తాను ఇచ్చిన హామీ అక్టోబర్ 2న అమలుకాబోతోందని, సూర్యాపేటకు ఐటీ హబ్ రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తొలి ప్రయత్నంలోనే 15 ఐటీ కంపెనీలు రావడం, దాదాపు 4 వేల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం రావడం ఆనందంగా ఉందన్నారు. అభ్యర్థుల తాకిడి దృష్ట్యా మరో సారి జాబ్మేళా నిర్వహస్తామని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అయితే, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసిన గొప్పతనం ఐటీ మంత్రి కేటీఆర్ది అని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఐటీ హబ్ల ఏర్పాటుకు మూలం కేసీఆర్, కేటీఆర్లే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ దేశానికే ఆదర్శమని, కేసీఆర్ పాలనా దక్షతతోనే దేశంలో ఐటీలో అగ్రస్థానంలో ఉన్న కర్నాటకను తెలంగాణ వెనక్కి నెట్టిందన్నారు. త్వరలోనే ఇంటి దగ్గరే ఉండి ఐటీ ఉద్యోగం చేసుకునే అవకాశం సూర్యాపేట యువతకు దక్కనున్నట్లు తెలిపారు. ఎన్నో ఆశలతో ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ యువత కోసమే ఈ రోజు ఐటీ హబ్ను విస్తరించడానికి కారణమన్నారు. ఐటీలో హైదరాబాద్ తర్వాత స్థానం సూర్యాపేటదే అన్న రీతిలో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేస్తామన్నారు.
వచ్చే ఐదేండ్లలో ఐదు వేల ఐటీ ఉద్యోగాలు..
వచ్చే ఐదేండ్లలో 50కి పైగా ఐటీ పరిశ్రమలను తీసుకొచ్చి 5 వేల ఉద్యోగాలు కల్పిస్తానని మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా ఇచ్చిన మేనిఫెస్టోతోపాటు తాను సొంతంగా రూపొందించిన మేనిఫెస్టో ప్రకారం ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా ప్రజలకు అవసరమయ్యే ప్రతి పనిని చేశానన్నారు. ఈ తొమ్మిదేండ్లలో సూర్యాపేట ఇంత అభివృద్ధి చెందుతుందని ఎవరూ ఊహించి ఉండరని, ప్రజలు తనను గెలిపించిన విశ్వాసం, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతోనే ఇవన్నీ చేయగలుగుతున్నానన్నారు. సూర్యాపేటలో ఏర్పాటు చేస్తున్న ఐటీ హబ్ను మెట్రోపాలిటన్ సిటీల్లో ఉండే ఐటీ కంపెనీలకు తీసిపోని విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 24 గంటల భద్రత, సూర్యాపేట నుంచి టీపార్కు వరకు ఉచిత రవాణా సౌకర్యం, హైస్పీడ్ ఇంటర్నెట్ ఇలా సకల సౌకర్యాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదే అన్నారు. నిరుద్యోగ యువత ఐటీ రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ సెంటర్ను ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య వారధిలా ఉన్న సూర్యాపేట ఐటీహబ్ రెండు రాష్ర్టాల ప్రజలకు తలమానికంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవరెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, సీఈఓ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ విజయ్ రంగినేనితోపాటు జడ్పీటీసీ జీడి భిక్షం, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
50 ఐటీ కంపెనీలు.. 5వేల ఉద్యోగాలు లక్ష్యం
‘సూర్యాపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ప్రజలకు అవసరమయ్యే అనేక పనులు చేపడుతున్నా. వచ్చే ఐదేండ్లలో సూర్యాపేటకు 50 ఐటీ కంపెనీలు తీసుకొచ్చి 5 వేల ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం. 2018లో నేను ఇచ్చిన హామీ మేరకు
అక్టోబర్ 2న సూర్యాపేటలో ఐటీ హబ్ ప్రారంభమవుతున్నది. తొలి ప్రయత్నంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగార్థులు రావడం సంతోషం కలిగించింది. అభ్యర్థుల తాకిడి దృష్ట్యా మరోమారు జాబ్మేళా నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది అయితే, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేసింది ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. సూర్యాపేట యువత అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో స్థిరపడాలి’
– ఐటీ జాబ్ మేళా ప్రారంభోత్సవంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేటకు ఐటీ ఘనత మంత్రి జగదీశ్రెడ్డిదే
రాష్ట్రంలో ఐటీని మేటిగా ఉంచడంలో మంత్రి కేటీఆర్ది కీలకపాత్ర అయితే, సూర్యాపేటకు ఐటీ హబ్ను తీసుకొచ్చిన ఘనత మంత్రి జగదీశ్రెడ్డిదే. జగదీశ్రెడ్డిని గెలిపిస్తే సూర్యాపేటను జిల్లా కేంద్రం చేస్తా, జగదీశ్ను మంత్రిని చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పకుండా అమలు చేశారు. సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటకే కాదు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడుపుతున్నారు. గత తొమ్మిదేండ్లలో సూర్యాపేట ఎంత అభివృద్ధి చెందిందో ఇక్కడి చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అలాంటిది ఇటీవల కొన్ని పార్టీలు, కొంత మంది గతంలో ఏమీ చేయకుండా సూర్యాపేట ప్రజలను వంచించారు.
-రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
ఐటీహబ్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
మంత్రి జగదీశ్రెడ్డి ఆలోచనల మేరకు సూర్యాపేట ఐటీ హబ్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వాస్తవానికి ఐటీ హబ్ ఏర్పాటు కావాలంటే కనీసం రెండేైండ్లెనా పట్టేది. కానీ, మంత్రి కృషితో ఏడు నెలల్లోనే పూర్తయ్యింది. ఇక్కడే ఇంజినీరింగ్ చదివిన యువతకు ఇక్కడే ఉద్యోగాలు అనే ఉద్దేశంతో ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు జరుగుతుంది. అక్టోబర్ 2న ఐటీ మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ఐటీ హబ్ ప్రారంభం కానున్నది.
-ఎస్.వెంకట్రావ్, కలెక్టర్, సూర్యాపేట
రెండు ఇంటర్వ్యూలకు హాజరయ్యా
నాది మోతె మండలం రాఘవాపురం ఎక్స్రోడ్. ఈ జాబ్మేళాలో డిగ్రీ వారికి కూడా అవకాశం ఇవ్వడంతో నేను ఇంటర్వ్యూకు వచ్చాను. ఉద్యోగార్థులను ఇంటర్వ్యూ చేసేందుకు చాలా కంపెనీలే వచ్చాయి. నేను మాత్రం వేర్కాగ్, సిస్టెక్ కార్ప్ కంపెనీల ఇంటర్వ్యూకు హాజరయ్యాను. ఉద్యోగం వస్తుందనే నమ్మకముంది. ఉద్యోగం వస్తే కుటుంబానికి కొంత ఆసరా అవుతాను. జాబ్మేళా అవకాశం కల్పించిన మంత్రి జగదీశ్రెడ్డికి మా నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు.
-ఆర్.సురేందర్, డిగ్రీ, రాఘవాపురం ఎక్స్రోడ్
సూర్యాపేటలో జాబ్మేళా హర్షణీయం
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ జాబ్మేళా నిర్వహించడం హర్షణీయం. మంత్రి జగదీశ్రెడ్డి సార్ మాట ఇచ్చారంటే తప్పరు. అందుకు నిదర్శనమే ఈ జాబ్మేళా. డిగ్రీ పూర్తి చేసిన నేను ఏదైనా ఉద్యోగం వస్తుందనే ఆశతో వచ్చాను. కానీ, ఇక్కడికి డిగ్రీ చదివిన వారి కంటే ఇంజినీరింగ్ చదివిన వారు అధికంగా రావడంతో వారికే అధిక ప్రాధాన్యం ఇస్తారనిపిస్తుంది. ఇన్ని కంపెనీలు పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొనే అవకాశం కల్పించిన మంత్రి జగదీశ్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
-అరుణ, డిగ్రీ, సూర్యాపేట
జగదీశ్రెడ్డి సార్కు ధన్యవాదాలు
బీబీగూడేనికి చెందిన నేను ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాను. ఉద్యోగం కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇంటర్వ్యూలకు వెళ్లాల్సి వస్తుంది. కానీ, అంతదూరం వెళ్లాలంటే ఇబ్బందితోపాటు ఎవరూ రాకపోవడంతో ఇంటర్వ్యూలకు వెళ్లలేకపోయాను. ఇప్పుడు జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్రెడ్డి సార్ ఏర్పాటు చేయించిన జాబ్మేళాలో నా ఇంటర్వ్యూ పూర్తయ్యింది. ఉద్యోగం వస్తుందని అనుకుంటున్నా. ఐటీ జాబ్మేళా నిర్వహించి నాలాంటి వాళ్లకు ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డికి థ్యాంక్స్.
-కె.వెంకటేశ్, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బీబీగూడెం
ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది
నేను బీఎస్పీ హానర్స్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాను. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఐటీ హాబ్ ఏర్పాటవుతుందని, అందుకు సంబంధించి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇక్కడకి వచ్చాను. ఇంటర్వ్యూలు చేసేందుకు చాలా కంపెనీలే వచ్చాయి. నేను మూడు కంపెనీలకు రెస్యూమ్ ఇచ్చి ఇంటర్వ్యూలో పాల్గొన్నా. నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. జాబ్మేళా ఏర్పాటు చేయించిన మంత్రి జగదీశ్రెడ్డి సార్కు కృతజ్ఞతలు.
-పూజిత, బీఎస్సీ హానర్స్, నల్లగొండ