చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 28 : మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు కుట్రలకు తెరలేపారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్రెడ్డి నాలుగేండ్లలో చేయని అభివృద్ధి ఏడాదిలో ఎలా చేస్తాడోప్రజలు ఆలోచించాలన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గత ఎన్నికల్లో ఓడిపోయినా నియోజకవర్గాన్ని పట్టుకొని ప్రజల మధ్యే ఉన్నాడని తెలిపారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గొర్రెల స్కీమ్లు, ముదిరాజ్లకు ఉచిత చేప పిల్లలు, గీత కార్మికులకు ఎలాంటి సాయమూ అందడం లేదని తెలిపారు.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు వేల కోట్ల రూపాయలు తెస్తామన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. కర్ణాటకలో కల్లు నిషేధాన్ని ఎత్తేసి గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్య ఈడిగ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామీజీ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికలో గెలిస్తే తాను, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిగ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడూ మీ మధ్యే ఉన్న ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభ్యర్థి కూసుకుంట్ల మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓడినా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నానన్నారు. అప్పట్లో ఎంపీగా ఉన్న రాజగోపాల్రెడ్డి, ఆయన సోదరుడు నాటి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దండుమల్కాపురం చెత్త డంపింగ్ యార్డ్కు ప్రయత్నిస్తే పోరాటం చేసి అడ్డుకున్నానని చెప్పారు. ఈ ప్రాంతానికి మిషన్ భగీరథ ద్వారా కృష్ణాజలాలు, పిలాయిపల్లి కాల్వ పునర్నిర్మాణానికి నిధులు తెచ్చినట్లు తెలిపారు.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా : కూసుకుంట్ల
2014లో తనను గెలిపిస్తే రూ.2500 కోట్ల అభివృద్ధి పనులు చేశానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. చౌటుప్పల్, తంగడపల్లి గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను సీఎం కేసీఆర్ పెంచుతున్నారని అబద్ధాలు చెప్తున్న బీజేపీ నాయకులను చెట్టుకు కట్టేసి నిలదీయాలన్నారు. ఈ ప్రాంతం కాని రాజగోపాల్రెడ్డికి మునుగోడుపై ఎందుకు ప్రేమ ఉంటుందో ఆలోచించాలని సూచించారు. కారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదిస్తే ప్రజల రుణం తీర్చుకుంటానని, ఆగిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.
పంతంగి, అంకిరెడ్డిగూడెంలో..
చౌటుప్పల్ మండలంలోని పంతంగి, అంకిరెడ్డిగూడెం గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రచారం నిర్వహించారు. బోనాలు, బతుకమ్మలు, డప్పుచప్పుళ్లు, కోలాటాలతో జనం ఘన స్వాగతం పలికారు.ప్రచారంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉద్యమ కారుడికి- కాంట్రాక్టర్కు మధ్య పోరు
చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 28 : 18ఏండ్ల ఉద్యమకారుడికి, రూ.18వేల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన కాంట్రాక్టర్ మధ్య జరుగుతున్న పోరే ఈ ఉప ఎన్నిక అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం చౌటుప్పల్ మండలంలోని చింతలగూడెం, దామెర గ్రామాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్గుప్తా, సీపీఐ రాష్ర్ట నాయకురాలు పశ్య పద్మతో కలిసి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజగోపాల్రెడ్డి నాలుగేండ్లుగా మునుగోడును పట్టించుకోలేదని, ఇప్పుడు గెలిచి ఏడాదిలో ఏం చేస్తాడని అన్నారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేసి పేదలకు ఆసరాగా ఉంటుంటే.. కేంద్రంలోని బీజేపీ ధరలు పెంచి భారం మోపుతున్నదని విమర్శించారు. దళిత వ్యతిరేకి అయిన బీజేపీ.. బీహార్, ఉత్తరప్రదేశ్లో దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నదన్నారు. కూసుకుంట్ల గెలుపు తర్వాత ఇద్దరం వచ్చి దామెర, చింతలగూడెం గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. కరోనాతో ఇండ్ల నిర్మాణంలో కొంత జాప్యం జరిగిందని, సొంత స్థలం ఉన్నవారికి నగదు లేదా ఇండ్లు కట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నదని తెలిపారు. తంగెడపల్లి గ్రామంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్, కూసుకుంట్లతో కలిసి ప్రచారం చేశారు.
సేవ చేసే వ్యక్తి కావాలా.. అమ్ముడుపోయే కాంట్రాక్టర్ కావాలా?
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్
చౌటుప్పల్, అక్టోబర్ 28 : నిత్యం మన మధ్యే ఉంటూ మనకు సేవ చేసే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కావాలో.. డబ్బు కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి అమ్ముడుపోయే కాంట్రాక్టర్ రాజగోపాల్రెడ్డి కావాలో తేల్చుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందగౌడ్ ప్రజలకు సూచించారు. చౌటుప్పల్ మండలంలోని తంగడపల్లి గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, అభ్యర్థి కూసుకుంట్లతో కలిసి నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. కాంట్రాక్టుల కోసం రాజీనామా చేశారన్నారు. డబ్బు మదమున్న కాంట్రాక్టర్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తంగడపల్లి సమస్యలు తీరాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని కోరారు.