గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే మంజూరు చేస్తూ రోడ్ల విస్తరణకు సహకరిస్తున్నది. తాజాగా ఆలేరు నియోజకవర్గంలో 9 రహదారుల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందుకోసం 10.43 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దాంతో తండాలు, గ్రామీణ ప్రాంత రహదారులు కొత్త రూపు సంతరించుకొని.. రవాణా సౌకర్యం మెరుగుపడనున్నది. వాహనదారుల ఇబ్బందులు తొలగనున్నాయి. శనివారం తుర్కపల్లి మండలంలో రెండు రహదారుల నిర్మాణానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.
– యాదాద్రి భువనగిరి, మే 5 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి భువనగిరి, మే 6 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలనలో కనీసం రోడ్డు సదుపాయం లేక ప్రజలు అవస్థలు పడ్డారు. ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా కనిపించేవి. కొత్త రోడ్లు వేయకపోగా.. కనీసం పాత వాటికి కూడా మరమ్మత్తులు చేసే పరిస్థితి ఉండేది కాదు. కానీ స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం పల్లె నుంచి పట్నం దాకా రోడ్లను విస్తరిస్తున్నది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడంతో నిధులు దండిగా విడుదలవుతున్నాయి. పాత రోడ్ల మరమ్మతులకు నిధులు ఇస్తూనే.. కొత్త రహదారులకు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నది. తండాలు, ఆవాసాలకు సైతం నిధులు మంజూరు చేస్తున్నది. పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి. రహదారులు రాచబాటలుగా మారుతున్నాయి.
9 బీటీ రోడ్లు.. రూ. 10.43 కోట్లు
జిల్లాలో ఇప్పటికే విరివిగా రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఎమ్మెల్యేల చొరవతో అవసవరం ఉన్న ప్రతి చోటా వందల కోట్ల రూపాయలతో రహదారులను నిర్మిస్తున్నారు. రోడ్ల పరిస్థితి మెరుగుపడింది. ఇంకా రోడ్లకు నోచుకోని గ్రామాలను గుర్తిస్తూ ప్రభుత్వ నిధులను మంజూరు చేస్తున్నది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో 9 రోడ్ల నిర్మాణానికి రూ. 10.43 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే మరింత రవాణా సదుపాయం మెరుగుపడనున్నది.
నేడు శంకుస్థాపన..
తుర్కపల్లి మండలంలోని పలు రోడ్లకు ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల నుంచి నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి విజ్ఞప్తి మేరకు మంత్రి సత్యవతి రాథోడ్ నిధులు మంజూరు చేశారు. శనివారం తుర్కపల్లి మండలంలో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి స్టేజీ వద్ద రూ.3.37 కోట్లతో బీటీ రోడ్డు, మల్కాపురం గ్రామంలో రూ.2.10 కోట్లతో బీటీఆర్ రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. అక్కడి నుంచి మాదాపూర్లో జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హాజరవుతారు.
కొత్తగా నిర్మించనున్న బీటీ రోడ్లు
ప్రతి పల్లెకు బీటీ రోడ్డే లక్ష్యం
సీఎం కేసీఆర్ పాలనలో రోడ్లన్నీ బాగుపడ్డాయి. మారుమూల తండాలకు కూడా రహదారులు వేస్తున్నాం. గతంలో పరిస్థితిని ఊహించుకోవడమే కష్టంగా ఉంది. తండాలు గ్రామపంచాయతీలుగా మారడంతో నిధుల వరద పారుతున్నది. ఇటీవల 9 రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలోనే బీటీ రోడ్ల నిర్మాణాలు ప్రారంభమవుతాయి. మరిన్ని నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా. గ్రామగ్రామాన రోడ్ల నిర్మాణాలు చేపట్టడమే లక్ష్యం. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ధ్యేయం.
-గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే