సమష్టిగా పనిచేసి నాగార్జున సాగర్లో మరోసారి గులాబీ జెండా ఎగుర వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్,నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారికి ఎన్నికల్లో భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను గడపగడపకూ వివరించాలని దిశానిర్దేశం చేశారు.
హాలియా, అక్టోబర్ 20 : జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజక వర్గం గడ్డపై గులాబీ జెండా ఎగుర వేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో కలిసి ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ నాయకత్వంలో సుమారు 1,500 మంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిశారు. వారితో సమావేశమమైన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వివరిస్తూ దిశానిర్ధేశం చేశారు.
రాష్ట్రంలో జరిగేవి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసే ఎన్నికలన్నారు. అందుకు అంతా కలిసిమెలిసి పనిచేయాలన్నారు. పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జీలు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రాంచందర్నాయక్ ఎమ్మెల్యేతో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, గ్రామాలకు వెళ్లి ఎన్నికల కోసం కొత్తగా బూత్ కమిటీలు వేయాలని సూచించారు. బూత్ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ మ్యానిపెస్టో అందజేయడంతో పాటు పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించాలన్నారు.
రాష్ర్టాభివృద్ధితో పాటు నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంటారో.. ఈ ఎన్నికలను కూడా అంతే సీరియస్గా తీసుకుని పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల హృదయాల్లో ఉన్నారని, నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉన్నదన్నారు. చిన్న చిన్న విభేదాలను పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. దసరా పండుగ తర్వాత వీలు చూసుకుని తాను కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రానున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్కు తరలివెళ్లిన వారిలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు ఉన్నారు.