బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. క్యాంపెయిన్లో భాగంగా బీఆర్ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మిర్యాలగూడలో చేపట్టనున్న రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. కేటీఆర్కు బైక్ ర్యాలీలతో ఘన స్వాగతం పలుకనున్నాయి. ఆలేరు నియోజకవర్గం యాదగిరిగుట్ట, భువనగిరి నియోజకవర్గం వలిగొండలోనూ మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. వలిగొండ, యాదగిరిగుట్ట, మిర్యాలగూడలో జరిగే రోడ్షోలో పాల్గొనున్నారు. అనంతరం కార్నర్ మీటింగ్లలో ప్రసంగించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.
ఉమ్మడి జిల్లా టూర్లో భాగంగా ఉదయం 11గంటలకు వలిగొండలో జరిగే రోడ్షోలో పాల్గొనడానికి ఆకాశమార్గాన హెలికాప్టర్లో చేరుకుంటారు. ఇప్పటికే వలిగొండ పరిధిలోని లోతుకుంటలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. స్థానిక నేతలు, పోలీసులు హెలిప్యాడ్ను పరిశీలించారు. కేటీఆర్ లోతుకుంట నుంచి ప్రచారం రథంపై రోడ్షోకు వెళ్తారు. మండలం కేంద్రంలో కేటీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం కేటీఆర్ ప్రసంగిస్తారు. అక్కడి నుంచి తిరిగి హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు బయల్దేరుతారు. వలిగొండలో ఆదివారం ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వలిగొండ అనంతరం కేటీఆర్ యాదగిరిగుట్టకు చేరుకుంటారు. కేటీఆర్ టూర్కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. గుట్టలో సైతం హెలిప్యాడ్ సిద్ధం చేశారు. కేటీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు పట్టణంలో 10 వేల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం పాత గుట్ట చౌరస్తాలో కేటీఆర్ ప్రసంగిస్తారు. గుట్టలో కేటీఆర్ టూర్ను జయప్రదం చేయాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి కోరారు.
యాదగిరిగుట్ట రోడ్షోకు 30 వేలు, వలిగొండ రోడ్షోకు 20 వేల మంది తరలిరానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రెండు పట్టణాలు గులాబీమయంగా మారాయి.
మిర్యాలగూడ : మిర్యాలగూడలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి కేటీఆర్ రోడ్షో నిర్వహించనున్నారు. రోడ్షోను పట్టణంలోని హనుమాన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి సాగర్ రోడ్డు మీదుగా రాజీవ్చౌక్ వరకు నిర్వహించనున్నారు. రాజీవ్చౌక్ వద్ద కేటీఆర్ ప్రసంగించనున్నారు. మిర్యాలగూడ పట్టణం, వేములపల్లి, మాడ్గులపల్లి, దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాల నుంచి వేలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు.