నల్లగొండను దత్తత తీసుకుని నిధులిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. ఆ నిధులతో సొంతింటిని దగ్గరుండి నిర్మించుకున్న మాదిరిగా నల్లగొండను అభివృద్ధి చేస్తున్న ఘనత ముమ్మాటికీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిదేనని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తాము నల్లగొండలో పర్యటిస్తుంటే ఇది నల్లగొండనేనా అన్న అభిప్రాయం కలిగిందని వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కిందట సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తాము నల్లగొండలో పర్యటించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ నల్లగొండను నెక్ట్స్ లెవల్ అభివృద్ధికి తీసుకెళ్లడమే లక్ష్యమని ప్రకటించారు. అందుకు మరిన్ని నిధులు కేసీఆర్ నుంచి మంజూరు చేయించే బాధ్యత తనదని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. నల్లగొండ అభివృద్ధి కొనసాగాలంటే భూపాల్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సోమవారం నల్లగొండలో రూ.912 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో మంత్రి ప్రసంగించారు. నల్లగొండను 65 ఏండ్లుగా కాంగ్రెస్ పాలకులు వదిలేశారని, దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తున్నదని చెప్పారు. నల్లగొండ ప్రజల కోరిక మేరకు రహదారులను బాగు చేయడంతోపాటు ఉపాధి కోసం ఐటీ హబ్ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారని తెలిపారు. అంతకుముందు ఐటీ హబ్లో ఉద్యోగులు, కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఐటీ కొలువులను చేరువ చేశామని, రానున్న రోజుల్లోమరింత మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
– నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్2 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ, అక్టోబర్ 2 : నల్లగొండలో గులాబీ జెండా ఎగురేస్తే పట్టణాన్ని పూర్తిగా పునర్నిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ హామీకి అనుగుణంగా నల్లగొండను రూ.1350 కోట్లతో అభివృద్ధ్ది చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతను తెలుపడంతోపాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నేపథ్యంలో ఎన్జీ కళాశాలలో సోమవారం నిర్వహించిన ప్రగతి నివేదన సభ ప్రజ్వరిల్లింది. బహిరంగ సభకు జనం ఊహించని రీతిలో హాజరు కావడంతో కళాశాల ప్రాంగణం కిక్కిరిసింది. అంతకుమించి బయట ఆయా ప్రాంతాల్లో నిలబడి మంత్రి కేటీఆర్ స్పీచ్ విన్నారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితోపాటు మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్ ప్రసంగాలు పూర్తయ్యే వరకు ఎక్కడికక్కడే నిలబడి సభను సక్సెస్ చేశారు. ఒక్క నల్లగొండ నియోజకవర్గం నుంచే ఇంత స్థాయిలో జనం రాగా.. ఎన్జీ కళాశాల సామర్థ్యం మించి ప్రజలు బయటే ఉన్నారు. ఒంటి చేతోడినని తనను ఎంతో అవమానించారని ఎమ్మెల్యే కంచర్ల కన్నీటి పర్యంతమైనప్పుడు ఒక్కసారిగా సభ నిశ్శబ్దంగా మారింది. ఆ తర్వాత మరోసారి ఒంటిచేతోడి దమ్మేందో చూపించాలని కోరడంతో జనం జేజేలు పలికారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : నల్లగొండను దత్తత తీసుకుని నిధులిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే.. ఆ నిధులతో దగ్గరుండి అభివృద్ధి చేస్తున్న ఘనత ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డిదేనని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో కలిసి సోమవారం రూ.912 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎన్జీ కాలేజీ మైదానంలో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ఆయన ప్రసంగించారు. నల్లగొండ ఐటీ హబ్ను రాష్ట్రంలోనే ఎక్కడా లేనంతటి అద్భుతంగా నిర్మించామన్నారు. నల్లగొండ పట్టణంలో రూ.1,350 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ తెస్తామని గతంలో మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి చెప్పి చేతులెత్తేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని, ఆస్పత్రిని మంజూరు చేశారని తెలిపారు. రూ.90కోట్లతో ఐటీ టవర్ నిర్మాణం, రూ.150 కోట్లతో రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.93కోట్లతో అత్యాధునిక కళాభారతి, రూ.30 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ నుంచి ఉదయ సముద్రం వరకు బీటీ రోడ్డు, 75కోట్ల రూపాయలతో ట్యాంక్బండ్ సుందరీకరణ, రూ.15 కోట్లతో వల్లభరావు చెరువు, రూ.46 కోట్లతో మర్రిగూడ ఫ్లైఓవర్, రూ.216 కోట్లతో యూజీడీ, రూ.77 కోట్లతో సీసీరోడ్ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాకపోతే ఈ పనులు అయ్యేవా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇన్ని పనులు అవుతుండేనా.. నల్లగొండ బాగుపడేనా? ఆలోచించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
నీలగిరి గులాబీమయం
మంత్రి కేటీఆర్ పర్యటనతో నల్లగొండ గులాబీమయమైంది. పట్టణంలో పెద్దఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు భారీ ర్యాలీ తీశారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటల మధ్య కోలాట బృందాలు, కళాకారుల నృత్యాలు కోలాహలంగా సాగాయి. అదే ఉత్సాహంతో జనం ప్రగతి నివేదన సభలో పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్పీచ్కు కేరింతలు కొట్టారు. జై కేసీఆర్.. జై కేటీఆర్ నినాదాలు మార్మోగాయి.
ఫ్లోరైడ్ పాపం వాళ్లదే..
ఫ్లోరోసిస్ను పెంచి లక్షన్నర మందిని జీవచ్ఛవంలా మారిస్తే.. స్వరాష్ట్రంలో ఆ మహమ్మారిని తరిమేసిన మొనగాడు సీఎం కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేటలో జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ కలిసి ఫ్లోరోసిస్ను రూపుమాపినందుకు జిల్లాలోని 12 స్థానాల్లో గులాబీ జెండా ఎగురాలని ఆకాంక్షించారని, ఇదే విషయాన్ని నల్లగొండ బిడ్డలకు చెప్పాలని కోరినట్లు వివరించారు. అంశల స్వామిని ప్రధాని వాజ్పేయ్ టేబుల్ మీద పడుకోబెట్టినా.. బీజేపీ, కాంగ్రెసోళ్లు కనికరించలేదని మండిపడ్డారు. కేసీఆర్ వచ్చాకే మిషన్ భగీరథతో తాగునీటి సమస్య పరిష్కారమైందని, భవిష్యత్తులో నల్లగొండలో పుట్టబోయే బిడ్డలు చందమామల లెక్క ఉంటారని అన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, కరెంటు.. ఇలా ఏ రంగాన్ని చూసినా తెలంగాణలో అద్భుత పాలన కనిపిస్తున్నదని చెప్పారు. నాటి నల్లగొండను, నేటి నల్లగొండను ప్రత్యక్షంగా చూస్తున్న ప్రజలు భూపాల్రెడ్డిని 70వేల మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని, పని చేసే నాయకులను ప్రోత్సహించాలని, భూపాల్రెడ్డి లాంటి మంచి నాయకుడిని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
కారుకూతల కోమటిరెడ్డి అప్పుడేం చేశాడు?
నల్లగొండను దత్తత తీసుకుంటానంటే కూతల రాయుడు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కారుకూతలు కూస్తున్నాడని విమర్శించారు. ఐటీ మంత్రిగా ఉండి ఐటీ కంపెనీ, మెడికల్ కాలేజీ తెస్తానని హామీ ఇచ్చి తెచ్చిండా? అని ప్రశ్నించారు. మంత్రిగా వెంకట్రెడ్డి చేయలేనిది ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చేసి చూపించాడన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి 24 గంటల కరెంటు మీద అనుమానం ఉంటే.. తనకు ఇష్టమొచ్చిన చోట, ఇష్టమొచ్చిన సమయానికి కరెంటు తీగలు పట్టుకోవాలని సవాల్ విసిరారు. కత్తి వాన్ది కాదు.. నెత్తి వాన్ది కాదు.. ఎటుపడితే అటు నరకొచ్చన్నది వెంకట్రెడ్డి తీరని మండిపడ్డారు. ఇదే వెంకట్రెడ్డి ఆనాడు దామరచర్లలో అతి పెద్ద అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ కడుతుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మూసేస్తమన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లు సీఎం కేసీఆర్ ఇస్తున్న కరెంటు గురించి మాట్లాడుతుంటే ఇజ్జత్ అనిపిస్తదన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు పరిశ్రమలు, ఐటీ హబ్, మెడికల్ కాలేజీలు తేలేదని.. కరెంటు, సాగు, తాగునీరు ఇవ్వకుండా ప్రజలను సావగొట్టారని మండిపడ్డారు. ఇవ్వాళ ఊదరగొడుతూ ఉపన్యాసాలు ఇస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మైండ్ దొబ్బినట్లుందని, భూపాల్రెడ్డి అంగవైకల్యం మీద మాట్లాడడం సరికాదని హితవు పలికారు. తమ కంటే ఎత్తు, పొడవు ఉన్న జానారెడ్డి, ఉత్తమ్కుమార్, వెంకట్రెడ్డి ఏం వెలగపెట్టారని ప్రశ్నించారు. 60 ఏండ్లలో ఎవరూ చేయలేని పనులన్నీ తొమ్మిదేండ్లలో తాము చేసి చూపించామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను నమ్మితే మూడు గంటల కరెంటు, ఏడాదికో సీఎం, కుంభకోణాల గ్యారంటీలే మిగులుతాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
మండలాల రోడ్ల కోసం నిధులిస్తాం
నల్లగొండను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లాలన్న తపనతో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మరిన్ని కోరికలు ముందుంచాడని మంత్రి కేటీఆర్ చెప్పారు. నల్లగొండ రూరల్, తిప్పర్తి, కనగల్, మాడ్గులపల్లి మండలాల్లో రోడ్ల కోసం రూ.26 కోట్లు అడిగారని, వాటిని మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. నల్లగొండ రూపురేఖలు మార్చేందుకు ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నల్లగొండలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ పూర్తి కావాలంటే మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని, భూపాల్రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మంత్రి కేటీఆర్ స్పీచ్కు కేరింతలు, ఈలలతో మద్దతు
మంత్రి కేటీఆర్ మాట్లాడే సమయంలో ప్రజలు ఎంతో ఆసక్తిగా విన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటితో లబ్ధి పొందుతున్నది నిజమా.. కాదా? అన్నప్పుడు జనం నిజమేనని చప్పట్లతో జేజేలు పలుకుతూ మద్దతు తెలిపారు. ఏడాది కాలంలోనే నల్లగొండకు రూ.1350 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేశామని, ఇక్కడి నుంచి మంత్రి అయిన కోమటిరెడ్డి వంటి కంత్రీగాళ్లు చేయలేని పని సాధారణ ఎమ్మెల్యేగా భూపాల్రెడ్డి చేశాడని చెప్పారు. ఫ్లోరోసిస్తో లక్షన్నర బిడ్డలను జీవచ్ఛవాలుగా మార్చింది ఈ కాంగ్రేసోళ్లు కాదా.. పేదింటి ఆడబిడ్డకు సీఎం కేసీఆర్ మేనమామలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా 13లక్షల మందిని ఆదుకున్నది నిజం కాదా? అంటే నిజమేనని జనం చప్పట్లతో చెప్పారు. నల్లగొండలో చేపట్టిన మెడికల్ కళాశాల, ఐటీ హబ్ నిర్మాణాలను ఫొటోలతో చూపించిన మంత్రి కేటీఆర్.. చేసిన అభివృద్ధిని ఒక్కొక్కటి చదివి వినిపించారు.
నల్లగొండను రూ.1350 కోట్లతో అభివృద్ధి చేశాం
20 ఏండ్లుగా నల్లగొండ ఒకే వ్యక్తి చేతిలో ఉండి అభివృద్ధికి నోచుకోకపోతే తాను ఒకే ఏడాదిలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో రూ.1350 కోట్లతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. నల్లగొండ కోటపై గులాబీ జెండా ఎగురేస్తే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన సీఎం మాటకు కట్టుబడి నిధులు ఇచ్చారన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో నల్లగొండను పూర్తిగా పునర్నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండకు ఐటీ హబ్ కావాలని మంత్రి కేటీఆర్ను అడిగితే రూ.90 కోట్లు ఇచ్చారని, వాటితో ఏడాదిలోనే రాష్ట్రంలోనే తలమానికమైన హబ్ నిర్మించి స్థానిక యువతకు ఐటీ కొలువులు దక్కేలా చేశామని చెప్పారు. నల్లగొండ అభివృద్ధిని జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్న కోమటిరెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలన్నారు. నల్లగొండను పూర్తిగా అభివృద్ధ్ది చేయాలంటే ఇంకా రెండేండ్లు సమయం కావాలని, అందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, గీత పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్, ట్రైకార్ చైర్మన్ రాంచందర్నాయక్, ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్సాగర్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత వేమిరెడ్డి నర్సింహారెడ్డి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఒంటి చేతోడని అవమానించారని కంటతడి పెట్టుకున్న ఎమ్మెల్యే
తాను ఒంటి చేతోడినని, ఒక్క చేయితో ఏం చేస్తాడని ఎంతో అవమానించారని.. వాటన్నింటినీ భరించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నల్లగొండను రూ.1350 కోట్లతో అభివృద్ధి చేసి ఈ ఒంటి చేతోడి పనితనం ఏంటో చూపించానని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఈ సమయంలో భావోద్వేగానికి లోనై కంటనీరు పెట్టుకున్నారు. వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, నల్లమోతు భాస్కర్రావు దగ్గరికి వెళ్లి ఓదార్చారు. అనంతరం ప్రసంగం కొనసాగించారు. గత ఎన్నికల్లో తనకున్న ఒక్క చేతికి మీ చేతులన్నీ కలిపి తనను గెలిపిస్తే తన ఒంటిచేతి నుంచి నిధులు పారి నల్లగొండ అభివృద్ధి అవుతున్నట్లు కంచర్ల తెలిపారు. తనను అవమానం చేసిన వ్యక్తి మాటలు కడుపులో దిగమింగుకొని నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని చెప్పారు. అటువంటి వ్యక్తిని మరోసారి చిత్తుగా ఓడించి రాజకీయంగా ఆగమాగం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అభివృద్ధిని ఆశీర్వదించండి
‘20 ఏండ్లుగా ఒక వ్యక్తి చేతిలో ఉన్న నల్లగొండ అభివృద్ధికి నోచుకోలేదు. ఒక్క ఏడాదిలోనే సీఎం కేసీఆర్ దత్తత, మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి సహకారంతో రూ.1350 కోట్ల అభివృద్ధి పనులు చేశాం. నేను ఒంటి చేతోడినని, ఏం అభివృద్ధి చేస్తాడని అవమానించారు. అవన్నీ భరిస్తూ అహర్నిషలు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా. అభివృద్ధిని జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్న కోమటిరెడ్డికి రాజకీయ సమాధి కట్టాలి. నల్లగొండను పూర్తిగా అభివృద్ధి చేయాలంటే మరో రెండేండ్లు సమయం కావాలి. దానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విన్నవించుకుంటున్నా’
– ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి