నల్లగొండ, జనవరి 17 : నీలగిరిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతకు శిక్షణపై కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
తొలుత శివాజీ నగర్లో శంకుస్థాపన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ ప్రజలు తనను మొదటి నుంచి ఆదరించి ఇప్పటివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి ప్రేమను గుండెల్లో పెట్టుకుంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో నల్లగొండ నలువైపులా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సొంతింటి కలను నిజం చేస్తానన్నారు. రాష్ట్రంలో యూపీఎస్సీ తరహాలో గ్రూప్ పరీక్షలు నిర్వహిస్తామని, ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని తెలిపారు.
త్వరలోనే 6 గ్యారెంటీలను 100 శాతం అమలు చేస్తామన్న మంత్రి, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు రూ.10 లక్షల ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామన్నారు. త్వరలో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆర్థిక సాయంతోపాటు తులం బంగారం అందజేస్తామని, అది కూడా పెండ్లి రోజే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
నల్లగొండ పట్టణంలో బుధవారం మంత్రి కోమటిరెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలుతగా శివాజీనగర్ నుంచి పానగల్ రోడ్డు వరకు రూ.90 లక్షలతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు, అనంతరం ఎన్జీ కళాశాల నుంచి రామగిరి వరకు రూ.1.30 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత బీట్ మార్కెట్లో నూతనంగా నిర్మించిన మారెట్ సెంటర్ను పరిశీలించి అక్కడ చేపట్టాల్సిన మార్పుల గురించి కలెక్టర్ హరిచందనకు పలు సూచనలు చేశారు.
అలాగే పండ్ల మారెట్ వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మారెట్ యార్డ్ను సందర్శించి వ్యాపారుల సమస్యలను సావధానంగా విని వాటిని త్వరలోనే పరిష్కరించుకుందామని వ్యాపారులకు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.23.75 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ భవనానికి మంత్రి జిల్లా కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందన దీప్తి, రాష్ట్ర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ డీఈ అజీజ్లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులే ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసి చెక్కులు అందజేస్తారని, తాము ఇందులో జోక్యం చేసుకోమని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో
నల్లగొండ నియోజకవర్గానికి చెందిన 244 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం కలెక్టర్ హరిచందనతోపాటు ఎస్పీ చందన దీప్తి, మున్సిపల్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై నల్లగొండ పట్టణంలో పెండింగ్ అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
అనంతరం నిరుద్యోగులకు సిల్ డెవలప్మెంట్ గురించి సెంచూరియన్ యూనివర్సిటీ ప్రతినిధులతో జూమ్ మీటింగ్ ద్వారా వారు అందిస్తున్న ట్రైనింగ్ కోర్సుల గురించి తెలుసుకున్నారు. కమర్షియల్ వెహికిల్ మెయింటనెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, హైడ్రాలిక్ మెషిన్ ట్రైనింగ్, అడ్వాన్స్ వుడ్ ఇంజినీరింగ్, అపెరల్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం, కేఫ్ కాఫీ డే వంటి బిజినెస్ మోడల్స్ ట్రైనింగ్, ఉపాధి కల్పన గురించి యూనివర్సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
క్లాక్ టవర్ వద్ద కళాభారతి నిర్మాణం, అందులో కల్పించాల్సిన సౌకర్యాల గురించి కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేశ్, ఫ్లోర్లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, రాములు, ఆర్డీఓ రవి, తాసీల్దార్ శ్రీనివాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొండల్రావు పాల్గొన్నారు.
నల్లగొండ వైద్య కళాశాలలో అన్ని రకాల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, విద్యుత్ శాఖ అధికారులతో వైద్య కళాశాలలో సమస్యలపై సమీక్షించి మెడికల్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, కళాశాలకు కావాల్సిన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలను ఫిబ్రవరి నెలాఖరులోగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజకుమారి,
డీఎంహెచ్ఓ కొండల్రావు, ఆస్పత్రి సూపరిటెండెంట్ లచ్చూ, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ చంద్రమోహన్ పాల్గొన్నారు.