దేవరకొండ రూరల్/మాల్, మార్చి10 : పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తండాకు రోడ్డు వేస్తామని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. దేవరకొండ మండల కేంద్రం డిండి క్రాస్రోడ్డులో మండలంలోని మైనంపల్లి నుంచి డిండి క్రాస్రోడ్డు వరకు రూ.14 కోట్లతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులకు ఆదివారం ఎమ్మెల్యే బాలూనాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు.
అంతకుముందు మంత్రి పట్టణంలోని శ్రీ గోదాదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు పనులు మూడేండ్లలో పూర్తి చేస్తానన్నారు. దేవరకొండ నియోజక వర్గంలో గిరిజనులు ఎక్కువగా ఉన్నందున వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం మంత్రి కోమటిరెడ్డి చింతపల్లి మండలంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో దేవరకొండ మున్సిపల్ చైర్మన్ఆలంపల్లి నర్సింహ, ఎంపీపీలు జాన్యాదవ్, పార్వతీచందూనాయక్, కొండూరి భవానీపవన్ కుమార్, ఎంపీటీసీ కొర్ర గౌతమిరాంసింగ్, నాయకులు అంగిరెకుల నాగభూషణం, కాయితి జితేందర్ రెడ్డి, యాదగిరి, శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.