నీలగిరి, డిసెంబర్ 25 : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఆర్ఎంపీల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం గ్రామీణ సుశృత వైద్యుల సంఘం 17వ వార్షికోత్సవ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎంపీల సమస్యల పరిషారానికి కృషి చేస్తానన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో వివిధ పథకాలకోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
గ్రామ సభలు నిర్వహించి అర్హులందరికీ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఎం అనిమల్ల కొండల్రావు, సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లేపల్లి శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర ప్రతినిధులు నేతి రాజేశ్వర్రావు, హనుమంతరావు, దాసోజు సత్యనారాయణ చారి, ఫార్మసిస్ట్ చిలుకూరి పరమాత్మ, పాల్గొన్నారు. అనంతరం వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిషరించాలని ఐఎన్టీయూసీ-3194 ఆధ్వర్యంలో మంత్రికి వినతిపత్రం అందించారు.
రామగిరి : నల్లగొండ గడియారం సెంటర్లో నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ అతిథి గృహం పనులను సోమవారం రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరిశీలించారు. భవనానికి సంబంధించిన మ్యాప్ను ఇంజినీర్లతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట అధికారులు, ఇంజినీర్లు, మున్సిపాల్ అధికారులు ఉన్నారు.