సూర్యాపేట టౌన్, జూన్ 12 : దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉన్నదని, అటువంటి యువత భవితకు సీఎం కేసీఆర్ కేరాఫ్గా నిలుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణలో మెరుగైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో స్వరాష్ట్రంలో కొలువులకు వెల్లువలా నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. తెచ్చిన తెలంగాణ ఫలితాలను కొత్త తరం ఎంజాయ్ చేయాలని, ఫలితాలను అందిపుచ్చుకొని యువత జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన 2కే రన్ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్ నుంచి సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ వరకు నిర్వహించిన ఈ రన్లో పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, అధికారులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తున్నదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని చెప్పారు. 2014కు ముందుతో పోల్చితే తొమ్మిదేండ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయని తెలిపారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం వినూత్న మార్పులు తీసుకొచ్చిందన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్లు అందిస్తున్నదని తెలిపారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రణాళికతో ముందుకెళుతున్నదన్నారు. మన ఉద్యోగాలు మన బిడ్డలకే దక్కాలన్న లక్ష్యంతో సమైక్య రాష్ట్రంలో ఉన్న జోనల్ విధానంలో సీఎం కేసీఆర్ సమూల మార్పులు తెచ్చారని తెలిపారు. ఆ విధానంలో ఉన్న లోపాల వల్ల వివిధ క్యాడర్లలోని పోస్టులను స్థానికేతరులు తన్నుకుపోయేవారని మంత్రి వివరించారు.
ఇందులో ఉన్న లోపాలతో తెలంగాణ యువతకు జరుగుతున్న నష్టం.. మారుమూల జిల్లాలు, మండలాల యువతకు ఉద్యోగావకాశాలు దక్కకపోవడం.. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీల విషయంలో శాస్త్రీయత లోపించడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ పాత జోనల్ విధానాన్ని సమూల ప్రక్షాళన చేశారన్నారు. 95శాతం ఉద్యోగాలు ఈ ప్రాంత బిడ్డలకే దక్కాలన్న లక్ష్యంతో కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయగా మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెల్లువలా నోటిఫికేషన్లు ఇస్తున్నదన్నారు. ప్రజల కష్టాలు, కన్నీళ్ల నుంచి పుట్టిందే తెలంగాణ ఉద్యమం అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాక ముందు కరెంట్ లేక కిరోసిన్ దీపాల మధ్య చదువులు వెళ్లదీయాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే హక్కులను సాధించుకోగలిగామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో పథకాలు ఇక్కడి ప్రజల జీవితాల్లో అలుముకున్న చీకట్లను పారదోలాయని, విద్యుత్ కోతలకు చెక్ పెట్టగలిగామని అన్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్లకు మైళ్లు నడిచే పరిస్థితుల నుంచి ఇంటింటికీ తాగునీరు అందించగలిగామని చెప్పారు. హేళన చేసిన నేతలకు చెంపపెట్టులా స్వరాష్ట్రం సాధించామన్నారు. ఒకప్పుడు గ్రామాల్లోకి వెళ్లాలంటే దుమ్ము కొట్టుకుపోయిన రోడ్లు భయపడేలా చేసేవని, రాష్ట్రం సిద్ధించాక గ్రామాల్లో అంతర్గత రోడ్లు, గ్రామం నుంచి మండలాలకు అద్భుతమైన రహదారులుగా తీర్చిదిద్దామని చెప్పారు. అభివృద్ధిలో గ్రామాలు సైతం పట్టణాలతో పోటీ పడుతున్నాయన్నారు.
సంక్షేమం కోసమే సంవత్సరానికి 65వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మెడికల్ కళాశాలలు రాకపోయేవన్నారు. వచ్చిన మెడికల్ కళాశాలల్లో ఎంతో మంది యువత వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించే తోడ్పాటును యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ కమిసనర్ పి.రామానుజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా ఏర్పాటుతో చేరువైన పాలన;రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్
వివిధ పనుల కోసం దూరాన ఉన్న నల్లగొండకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడేవారని, సూర్యాపేట జిల్లా ఏర్పాటుతో పాలన చేరువై ఇబ్బందులు తప్పాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మంత్రి జగదీశ్రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి సీఎం కేసీఆర్కు కుడి భుజంగా ఉంటూ ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై తన మార్కు చూపించారని తెలిపారు. మెడికల్ కళాశాల, రెండు మినీ ట్యాంక్బండ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సమీకృత కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలతోపాటు న్యాక్ సెంటర్, ఆటోనగర్ను ఏర్పాటు చేసి అభివృద్ధిలో సూర్యాపేటను ఆదర్శంగా నిలిపారని కొనియాడారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో యువతీ యువకులకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి జగదీశ్రెడ్డికి మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు.