ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్-ఉల్-ఫితర్ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. కొత్త బట్టలు ధరించి అత్తరు గుబాళింపుతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొన్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని ఈద్ ముబారక్ చెప్పుకొన్నారు. సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ప్రార్థనల్లో పాల్గొనగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. షీర్ఖుర్మాతోపాటు ప్రత్యేక వంటలు చేసుకొని ముస్లింలు బంధుమిత్రులతో ఆనందంగా గడిపారు.
ముస్లింలకు అత్యంత పెద్ద పండుగైన రంజాన్ (ఈదుల్ ఫిత్)్రను శనివారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈద్గాహ్లు, మసీదుల వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ఈద్గాహ్ల వద్దకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నల్లగొండ జిల్లా కేంద్రం మునుగోడు రోడ్డులోని ఈద్గాహ్లో జరిగిన ప్రార్థనలకు జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావుతోపాటు అధికారులు హాజరై ముస్లింలను ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నల్లగొండలో ముస్లిం మత గురువు పెద్ద మౌలానా ఎహసానొద్దీన్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రత్యేకమైన షీర్కుర్మా స్వీకరించారు.
సూర్యాపేట రూరల్/ రామగిరి, ఏప్రిల్ 22 : భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ రాష్ట్రం ప్రతీకగా నిలిచిందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దోహదపడ్డాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్ సమీపంలోని ఈద్గాహ్లో శనివారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ఎస్డీ రియాజుద్దీన్, ఉర్దూఘర్ చైర్మన్ ఎస్కే సయ్యద్, మైనార్టీ నాయకులు షేక్ నజీర్, పిల్లు, తాహేర్, నయీం, షకీల్, మౌలానా షాహిద్ నివాసాలకు మంత్రి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అదేవిధంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో ముస్లిం మత పెద్ద మౌలానా ఎహసానొద్దీన్ నివాసానికి వెళ్లి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యాపేట, నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. నెల రోజులుగా కఠోరమైన ఉపవాస దీక్ష చేపట్టి భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకొంటున్న ముస్లిం సమాజానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. యావత్ సమాజం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలన్న సంకల్పంతో నెల రోజులు దీక్షతో చేసిన వారి ప్రార్థనలకు అల్లాహ్ మోక్షం కలిగిస్తారన్న విశ్వాసం ఉన్నదన్నారు.
సర్వమత ఆచార వ్యవహారాలను గౌరవించడంలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను చాటుకున్నదని పేర్కొన్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగలను అధికారికంగా నిర్వహించేది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు ఇది చక్కటి నిదర్శనమన్నారు. పండుగను పేదలు సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో ప్రభుత్వం బట్టలు, తోఫా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అల్లాహ్ దయతో తెలంగాణ సుభిక్షంగా, సస్యశ్యామలంగా మారిందన్నారు. మత సామరస్యంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్గా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ నేత వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.