ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూరు జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. మహిళా స్నేహ పూర్వక గ్రామం విభాగంలో అవార్డు రాగా ఈ నెల 24న ఢిల్లీలో పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందించనున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తన దత్తత గ్రామమైన ఏపూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారు. డ్రైనేజీలు, పారిశుధ్యం, సీసీ రోడ్లు, తాగునీటి పైప్లైన్లు తదితర వాటిని పూర్తి చేయించి ప్రజా సమస్యలను ఎప్పకప్పుడు పరిష్కరిస్తున్నారు. దాంతో ఏపూరు ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. జిల్లా స్థాయిలో 2019లో ఉత్తమ సర్పంచ్, 2020లో ఉత్తమ పంచాయతీ సెక్రటరీ అవార్డులు వచ్చాయి. 2022-23లో మహిళా స్నేహ పూర్వక విభాగంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు దక్కగా తాజాగా జాతీయ స్థాయిలో అవార్డు లభించింది.
సూర్యాపేట, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : మంత్రి జగదీశ్రెడ్డి దత్తత గ్రామం ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు పంచాయతీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల్లో మహిళా స్నేహపూర్వక విభాగంలో ఉత్తమ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దివస్ రోజు అవార్డును ఢిల్లీలో అందుకోనున్నారు. అవార్డు ప్రదానోత్సవానికి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, లోక్సభ సభ్యుడు, ఏపూరు సర్పంచ్, పంచాయతీరాజ్ సెక్రటరీలకు ఆహ్వానం అందింది. పురస్కారంతో పాటు రూ.50 లక్షల అవార్డును కూడా అందనుంది.
విపక్షాలు సైతం మెచ్చుకునేలా..
విపక్షాలు సైతం మెచ్చుకునేలా సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. 2014లో గెలుపొంది మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి చిన్న సమస్యలను కూడా వదలుకుండా అధికారులతో జరిగే పనులైతే స్థానికంగానే చేయించడం..అవసరమైతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి ఉమ్మడి జిల్లాలోని అన్ని రంగాలను సమాంతరంగా అభివృద్ధి చేయిస్తున్నారు. అందుకే అనేక అవార్డులు, పురస్కారాలు దరి చేరుతున్నాయి. అన్నింటికీ మించి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంచాయతీ పురస్కారాల్లో గతేడాది తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలానికి దక్కితే ఈ యేడాది ఆత్మకూర్.ఎస్ మండలం ఏపూరు గ్రామానికి వచ్చింది.
జాతీయ స్థాయిలో మొత్తం 27 అవార్డులు ప్రకటిస్తే అందులో 13 సాధించుకున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నమోదు చేసుకుంది. యావత్ దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, అస్సాం, అండమాన్ నికోబర్ దీవులకు ఒక్కోటి రాగా తెలంగాణ తరువాత చిన్న రాష్ట్రంగా ఉన్న కేరళకు 4, జమ్మూ కాశ్మీర్కు 3, ఒడిశా 3, మహారాష్ట్రకు 3 అవార్డులు దక్కాయి. అలాగే 13 అవార్డులు దక్కించుకొని నంబర్వన్ స్థానంలో నిలిచిన రాష్ర్టానికి చెందిన నాలుగు గ్రామ పంచాయతీలు మొదటి ర్యాంకు సాధించగా రెండో స్థానంలో రెండు గ్రామ పంచాయతీలు, మూడో స్థానంలో మరో మూడు గ్రామ పంచాయతీలు పురస్కారాలు పొందాయి.
మంత్రి జగదీశ్రెడ్డి ఏపూరును దత్తత తీసుకున్న తర్వాత 2016లో చేపట్టిన గ్రామ జ్యోతి కార్యక్రమానికి హాజరై ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 8 గంటల పాటు అధికార యం త్రాంగంతో ఊరంతా కలియ తిరిగారు. ఒక్కొక్కరిని పలుకరిస్తూ పిచ్చిమొక్కలు తొలగించడం, మురుగు కాల్వలు శుభ్రం చేయించడం తదితర కార్యక్రమాలను చేయించారు. అంతకు ముందు అధ్వానంగా ఉన్న ఏపూరు బాగుపడడం అప్పడే నాంది పడింది. జిల్లా మినరల్ ఫండ్, మంత్రి సొంత నిధులు వెచ్చించి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మిషన్ భగీరధ పథకం ప్రారంభానికి ముందు ఏపూరు వెళ్లిన సమయంలో గ్రామంలో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని గ్రామస్తులు మంత్రి దృష్టి తీసుకొచ్చారు. దాంతోస్పందించి 24 గంటల్లో సమీపంలోని ఏటిలో బావి తొవ్వించి పైపులైన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయించడంతో ఆనాడు గ్రామస్తుల ఆనందం అంతాఇంతా కాదు.
ఏపూరుకు అవార్డుల పంట
గ్రామంలో మంత్రి జగదీశ్రెడ్డి చేస్తున్న అభివృద్ధ్దికి గ్రామస్తులు అన్ని విషయాల్లో అధికారులకు సహకరిస్తుండడంతో అవార్డుల పంట పండుతున్నది. 2019లో ఉత్తమ సర్పంచ్, 2020లో ఉత్తమ పంచాయతీ సెక్రటరీ, 2021లో జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం 2022-23లో మహిళ స్నేహపూర్వక విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డుకు ఎంపికైంది. ఏప్రిల్ 24న ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకోనున్నారు.
మరిన్ని అవార్డులు అందుకుంటాం
ఏపూరు గ్రామానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పురస్కారంతో పాటు రూ.50 లక్షల అవార్డు రావడం అనేది మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో పాటు గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, గ్రామస్తుల సమష్టి కృషి ఉంది. గతంలో జిల్లాకు పెద్దగా అవార్డులు రాకపోగా గతేడాది తిరుమలగిరి మండలం, నేడు ఏపూరు గ్రామానికి అవార్డులు రావడం జరిగింది. ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని అవార్డులు అందుకుంటాం.
– యాదయ్య, డీపీఓ
మంత్రి సహకారంతోనే అభివృద్ధి
మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఏపూరును అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేశాం. మంత్రి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు గ్రామంలోని సమస్యలను పరిష్కరించడంతో జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైంది. గ్రామ సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకొని వాటిని దశల వారీగా పరిష్కరించుకుంటూ వచ్చా. గ్రామానికి జాతీయ స్థాయి అవార్డు రావడం ఆనందంగా ఉంది.
– సానబోయిన రజితా సుధాకర్, సర్పంచ్, ఏపూరు