ప్రగతి పరుగులు తొక్కుతున్న సూర్యాపేట ఇక పారిశ్రామికాభివృద్ధికి కూడా కేరాఫ్ కానున్నది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఇమాంపేటలో ఆటోనగర్ నిర్మాణానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే ప్రాంతంలో 69 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు శనివారం ఆటోనగర్ ప్రాంతాన్ని మంత్రి జగదీశ్రెడ్డి రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఎండీ నర్సింహారెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్తో కలిసి పరిశీలించి, అక్కడే సమీక్ష నిర్వహించారు. ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి రూ.16కోట్ల నిధులు అవసరమని ప్రాధమికంగా అంచనా వేసి, ప్రభుత్వానికి పంపేదుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈఎస్ఐ ఆస్పత్రి, కార్మిక సంక్షేమ భవన్, విశామైన రోడ్లు, కమాన్ నిర్మాణాలను అందులో పేర్కొన్నారు. ఆటో నగర్కు దాదాపు వంద ఎకరాలు అవసరం ఉండగా, ఇప్పటికే 34 ఎకరాల సేకరణ పూర్తయింది. ఇండస్ట్రియల్ పార్కు కోసం మరో 69 ఎకరాలను సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ పారిశ్రామిక వాడ అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 5 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది.
-సూర్యాపేట, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ)/సూర్యాపేట రూరల్
సూర్యాపేట, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట అభివృద్ధిని చెప్పాలంటే ఖచ్చితంగా జగదీశ్రెడ్డికి ముందు.. తర్వాత అని చెప్పాల్సిందే. ఎందుకంటే ఉమ్మడి పాలనతో పోల్చుకుంటే స్వరాష్ట్రంలో ఎనలేని విధంగా సూర్యాపేట రూపాంతరం చెందింది. ఈ విషయాన్ని సాధారణ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులు సైతం అంగీకరిస్తారు. 2014, 2018లో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న జగదీశ్రెడ్డి రెండుసార్లు కూడా ఎన్నికలకు ముందు ప్రణాళికాయుతంగా నియోజకవర్గానికి ఏది అవసరం ? ఏమేం చేయాలి ? అనేదానిపై కసరత్తు చేసి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోకు తోడుగా నియోజక వర్గానికి ప్రత్యేకంగా మెనిఫెస్టోను ప్రకటించి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇచ్చిన హామీలే కాకుండా రెండో మినీ ట్యాంక్బండ్, మెడికల్ కళాశాల, చౌరస్తాల విస్తరణ-ఆధునీకరణ, ఎస్టీపీ ప్లాంట్, నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో చెక్ డ్యామ్ల నిర్మాణాలు ఇలా ప్రజలకు అవసరమయ్యే అనేక పనులను కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టారు. 2018లో ఇచ్చిన హామీల్లో అన్నీ అమలు కాగా ఆటోనగర్, ఇండస్ట్రియల్ పార్క్లు పెండింగ్లో ఉండగా నేడు చిట్టచివరి ఆ హామీలు కూడా కార్యరూపం దాల్చబోతున్నాయి. ఆటోనగర్, ఇండస్ట్రియల్ పార్క్ల కోసం సేకరించిన స్థలంలో లే అవుట్ చేసి ప్లాట్లుగా విభజిస్తారు. రహదారులు, డ్రైన్లు, గ్రీనరీ, నీటి సౌకర్యం తదితర అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.
40 ఏళ్ల డిమాండ్కు మోక్షం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట అతి పెద్ద పట్టణం కాగా వ్యాపారపరంగా కూడా అగ్రగామి. ఇక్కడ దాదాపు నాలుగైదు దశాబ్ధాల నుంచి చిన్న, పెద్ద వాహనాలు భారీగా ఉండగా మెకానిక్లు సైతం అదే స్థాయిలో జీవనోపాధి పొందుతున్నారు. దాంతో 40 ఏళ్లుగా మెకానిక్లు ఇక్కడ ఆటోనగర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. గత పాలకులు హామీలు ఇచ్చారు తప్పా.. పట్టించుకున్న దాఖలాలు లేవు. మంత్రి జగదీశ్రెడ్డి 40 ఏండ్ల డిమాండ్కు మోక్షం కల్పిస్తూ ఆటోనగర్, ఇండస్ట్రియల్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ఇమాంపేట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో ఆటోనగర్ కోసం దాదాపు వంద ఎకరాలు అవసరం ఉండగా 34 ఎకరాల సేకరణ పూర్తయింది. అలాగే ఇండస్ట్రియల్ పార్కు కోసం 69 ఎకరాలు సిద్ధం చేస్తున్నారు.
సకల హంగులతో అద్భుత నిర్మాణాలు
సూర్యాపేట రూరల్ : తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఎండీ నర్సింహారెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్, ఇతర అధికారులతో కలిసి ఇమాంపేట సమీపంలోని ఆటోనగర్ ప్రాంతాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శనివారం సందర్శించి అక్కడే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నిర్మాణాల కోసం రూ.16 కోట్లు నిధుల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నభూతో..నభవిష్యత్ అన్న రీతిలో ఇమాంపేట ఇండస్ట్రియల్ పార్కులో సకల హంగులతో అద్భుత నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. పారిశ్రామిక పార్కు ముందు ఆకట్టుకునే కమాన్, ప్రధాన రహదారి నుంచి చివరి వరకు విశాలమైన రోడ్లు, కార్మికుల శ్రేయస్సు కోసం కార్మిక సంక్షేమ భవనం, వారి ఆరోగ్య పరిరక్షణకు ఈ.ఎస్.ఐ ఆస్పత్రి వంటి నిర్మాణాలు రూపుదిద్దుకోనున్నాయి. నిర్మాణాల నాణ్యతలో రాజీపడొద్దని అధికారులకు మంత్రి సూచించారు. అతి త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అత్యాధునిక పారిశ్రామిక పార్కులో ఇంకా చేపట్టాల్సిన నిర్మాణాలు, సౌకర్యాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
నాన్న హయాం నుంచి అడుగుతున్నాం
నేను 25 ఏండ్లుగా మెకానిక్గా పనిచేస్తున్నా. మా నాన్న కూడా మెకానికే. నాన్న హయాం నుంచి 40 ఏండ్లుగా సూర్యాపేటలో ఆటో నగర్ కావాలని డిమాండ్ చేస్తుండగా మంత్రి జగదీశ్రెడ్డి ద్వారా మా హయాంలో వస్తుంది. సకల సౌకర్యాలు కల్పించి ఇస్తామని చెబుతున్నారు. మాకు అంతకన్నా ఎక్కువేం కావాలి. మెకానిక్లు, వర్కర్లు ఎప్పటికీ మంత్రికి రుణపడి ఉంటాం.
– షేక్ జాని, మెకానిక్
కలను నిజం చేసిన మంత్రి జగదీశ్రెడ్డి
ఆటోనగర్.. పట్టణంలోని టూ, ఫోర్ వీలర్ అంతకంటే పెద్ద బండ్ల మెకానిక్ల చిరకాల కల. ఆటోనగర్ మెకానిక్లకు తీరని కలగానే మిగులుతది అనుకున్నా. కానీ మంత్రి జగదీశ్రెడ్డి ఆటోనగర్ను ఏర్పాటు చేస్తూ మెకానిక్ల కలను సాకారం చేస్తుండు. బైక్ పాయింట్లకు కిరాయి ఇచ్చేందుకు దుకాణాల యజమానులు అంగీకరించరు. ప్రతిసారి ఓనర్ ఖాళీ చేయమనడం మరోచోటకు మారడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఆటోనగర్ ఏర్పాటైతే మెకానిక్లందరికీ ఒక అడ్డా ఏర్పడుతుంది.
– పర్వతం లింగాచారి, బైక్ మెకానిక్, సూర్యాపేట