ఒకప్పుడు ఒంట్లో సుస్తీ చేసిందంటే ప్రైవేట్ దవాఖానకు పరుగులు తీయాల్సిన దుస్థితి. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యుల ఖాళీలు, వసతుల లేమి, అందుబాటులో లేని అధునాతన వైద్యం.. అందుక్కారణం. ఫలితంగా పేదల్లో పరీక్షల దగ్గర నుంచి మందులు, ఆపరేషన్ల వరకూ వేలల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్షేత్రస్థాయి వరకు ప్రజా వైద్య వ్యవస్థ బలోపేతం అవడంతో ఎక్కడికక్కడ నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల ద్వారా వైద్యం ప్రజల ముంగిటకే వచ్చింది. నల్లగొండ, సూర్యాపేటకు రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేయడంతో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి
వచ్చాయి. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్లు కిడ్నీ బాధితుల అవస్థలు తీరుస్తున్నాయి. సబ్ సెంటర్లు మొదలుకొని వంద పడకల ఆస్పత్రులు కూడా వచ్చాయి. తద్వారా పైసా ఖర్చు లేకుండా ప్రజలు ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన వైద్యం పొందుతున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆరోగ్య దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు.
నీలగిరి, జూన్ 13 : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు ఏ రోగమొచ్చినా.. ప్రైవేట్ దవాఖానకు పోవాల్సిన పరిస్థితి. పల్లెల్లో ఆస్పత్రులు అసలే లేవు. పెద్ద రోగాలు, డెలివరీ, ఆపరేషన్లకు సైతం పట్టణాలకు పరుగులు పెట్టాల్సిందే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అసలు రోగులను పట్టించుకునే పరిస్థితే ఉండేది కాదు. కానీ కొట్లాడి తెచ్చుకొన్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వలో ప్రజలకు వైద్యం అందించ డంలో గణనీయమైన అభివృద్ధి జరిగింది. పల్లె నుంచి పట్నం దాక సర్కారు వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అన్ని రకాల సదుపాయాలతో ఆస్పత్రులు ఏర్పాటయ్యాయి. మంచి డాక్టర్లు, ఉచిత పరీక్షలు, మందులు అందుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా ప్రజలు వైద్యాన్ని పొందుతున్నారు. ఉచిత డయాలసిస్ సెంటర్లు, పాలిటేటివ్ కేర్ సెంటర్, ఫిజియో థెరపీ సెంటర్లు ఏర్పాటయ్యాయి. సబ్ సెంటర్లు మొదలుకొని వంద పడకల ఆస్పత్రులు కూడా వచ్చాయి.
క్యాన్సర్ రోగులకు ప్రత్యేక విభాగం
ప్రాణాంతకమైన క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన వారికోసం రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ జిల్లా కేంద్రంలో పాలియేటివ్ కేర్ యూనిట్ను ఏర్పాటు చేసింది. ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా 20 పడకలతో అన్ని రకాల వసతులతో యూనిట్ను ఏర్పాటు చేసింది. ఇందులో జిల్లాలో 182 మంది ఇన్పేషెంట్లకు, 245 ఔట్ పేషేంట్లకు చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితులను నిత్యం పర్యవేక్షిస్తూ వైద్య సేవలందిస్తున్నాయి.
నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లా కేంద్రంలో ఉన్న 250 పడకల జిల్లా జనరల్ ఆస్పత్రిని 400 పడకలకు పెంచింది. ఎంసీహెచ్ కూడా ఆధునీకరించి అదనంగా 150 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 550 పడకలతో జిల్లా జనరల్ ఆస్పత్రి అన్ని రకాల రోగులకు చికిత్స అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఐసీయూలు మరో 10 పడకలు, డయాలసిస్ సెంటర్ 10 పడకలను పెంచారు. దాంతో పాటు చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 12 పడకలతో ఐసీయూను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో ఆస్పత్రిలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 550 పడకలకు ఆక్సిజన్ అందేలా సెంట్రలైజ్ చేశారు. వీటితోపాటు కోటి రూపాయలతో సిటీ సాన్ మిషన్, రూ. 40 లక్షలతో ఎక్స్రే, రూ.20 లక్షలతో మోకాలి శస్త్ర చికిత్సల కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ను సిద్ధం చేశారు. లాప్రోసోపిక్ సర్జరీ విభాగాన్ని తెలంగాణ డయాగ్నటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
రూ.116 కోట్లతో మెడికల్ కళాశాల
పట్టణ శివారు ప్రాంతంలోని ఎస్ఎల్బీసీలో సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో రూ. 275 కోట్లతో మెడికల్ కళాశాల మంజూరు కాగా ప్రస్తుతం రూ. 116 కోట్లతో భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 10 ఎకరాల స్థలంలో కళాశాలతో పాటు హాస్టల్స్ నిర్మిస్తున్నారు. దాంతో పాటు 5.6 ఎకరాల్లో పార్కులను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
మారుమూల ప్రాంతాలల్లో మెరుగైన వైద్య సేవలు
జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ డివిజన్లలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లు, ఐసీయూలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మర్రిగూడలో డిజిటల్ ఎక్సరే ఏర్పాటు చేశారు. నకిరేకల్ ఆస్పత్రిని 100 పడకలకు పెంచి కొత్త భవనం నిర్మిస్తున్నారు. జిల్లాలో 18 పీహెచ్సీలను ఆధునీకరించి 24 గంటలపాటు వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకొన్నారు. మిర్యాలగూడలో 30 పడకలతో చిన్నారుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేయడంతో పాటు అదనంగా 100 పడకలను పెంచి రూ.15 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టారు.
ఆరోగ్య మహిళ
మహిళలకు సంపూర్ణ ఆరోగ్యం అందించేందుకు ప్రతి మంగళవారం కేవలం మహిళలకే వైద్యసేవలు అందించేందుకు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున పీహెచ్సీలను ఆరోగ్య మహిళ కేంద్రానికి కేటాయించారు. కేంద్రానికి వచ్చే మహిళలకు ఎనమిది రకాల పరీక్షలు చేస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించి తగిన మందులు ఉచితంగా అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 4690 మందికి పైగా పరీక్షలు చేశారు.
పల్లె నుంచి పట్నం వరకు అందుబాటులో ఆరోగ్య సేవలు
ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు
నల్లగొండ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగు పరిచారు. 18 పీహెచ్సీలను అప్గ్రేడ్ చేసి 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. షుగర్ వ్యాధిగ్రస్తులు 88,780, బీపీతో బాధపడేవారు 1,34,284 మందికి ఎన్సీడీకిట్లను అందిస్తున్నారు. దాంతో పాటు ఆశ కార్యకర్తల వద్దే గ్లూకో మీటర్లు పెట్టి పల్లె ప్రజల ఆరోగ్యాన్ని ఎల్లవేళలా పరీక్షించి, ఏదైనా ఇబ్బందులు కలిగితే ప్రభుత్వ వైద్యశాలకు తరలించేలా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనిషి జీవిత ఆయుష్సు 60 నుంచి 65 సంవ్సరాలకు పెరిగిందంటే అది సీఎం కేసీఆర్ ఘనతే.
బస్తీ, పల్లె దవాఖానలు
పల్లె ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 5వేల జనాభా కలిగిన 195 సబ్సెంటర్లను పల్లె దవఖానాలుగా మార్చింది. దాంతో పాటు కొత్తగా ఏడు పీహెచ్సీలు, ఐదు బస్తీ దవఖానులను ఏర్పాటు చేసింది.
సూర్యాపేట, నల్లగొండలో ట్రామా సెంటర్లు
రూ. 47.50 కోట్లు మంజూరు
జాతీయ రహదారులతో పాటు సమీప ప్రాంతాల్లో జరిగే రోడ్డు ప్రమాద బాధితులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ట్రామా కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందుకు గానూ రూ.47.50 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం జీఓ జారీ చేసింది. సూర్యాపేట, నల్లగొండ జిల్లా కేంద్రాల్లోని మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ట్రామా కేంద్రాల్లో అత్యవసర చికిత్సలకు సరిపడా ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచనున్నారు. ఆక్సిజన్తో సహా 24 గంటలు అన్ని విభాగాల వైద్యులు ఇందులో అందుబాటులో ఉంటారు. ట్రామా సెంటర్లు మంజూరు చేయించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
నేడు ఆరోగ్య దినోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల ఆవరణలో ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రారంభించనున్నారు. దాంతో పాటు ఆశా, సెకండ్ ఏఎన్ఎంలకు చీరెల పంపిణీ, ఉత్తమ వైద్య ఉద్యోగులకు మెమోంటోలు, బహుమతులు అందించనున్నారు. పీహెచ్సీలకు బీపీ కిట్ల పంపిణీతో పాటు వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన కార్యక్రమాతో రూపొందించిన ఆరోగ్య తెలంగాణ బ్రోచర్ల ఆవిష్కరణ చేయనున్నట్లు సూర్యాపేట జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి తెలిపారు.
బంగారు తెలంగాణ
నీకు చెపుతూనే ఉన్నా.. చరిత్ర పుటల్ని ఆవలోకించమని సూదిని మూటగట్టడం, చుక్కల్ని లెక్కబెట్టడం ఎవడివల్ల కాదని గాలిని పీల్చగలం కానీ-చూడడం, బంధించడం రాదని..నిప్పును దూదిలో దాచెయ్యడం-అలల్ని అరచేతుల్లో కట్టేయడం నిజాన్ని ఇజాల్లో మార్చేయడం.. భ్రమ కాక మరేం అవుతుంది?అసమానతల గోడలు.. ఎప్పటికైనా చెర్లిన్ గోడలా పడిపోతాయనినా కాళ్లకేసిన బేడీలు.. తుప్పు పట్టి ఊడతాయని
గడ్డి పోచలన్నీ ఏకమై… తుమ్మ తుంగను తొక్కేస్తాయని..నేను చెబుతునే ఉన్నా. .అయినా నువ్వు వినలేదు.కాకి లెక్కల చిట్కాలు.. కంప్యూటర్తో సరిరావని ఏదో రోజు నిజం పాదరసంలా.. నీ గొంతును కాల్చేస్తుందని కొన ఇరిగిన ఇనుపమేకు.. చార్మి గోడను దిగ కొట్టలేదనిపరమాణువులన్నీ కలసి పకడ్బందీ ప్లానుతో ముందుకెళ్తాయని ఎన్ని వాస్తవ విశ్లేషణ విస్ఫోటనాలు.. చెప్పినా నీకేమి తాకలేదు. నేడు సంకేళ్ల శృంఖలాలు.. తెగిపడ్డాయి కుక్కలన్నీ సింహాలను తరిమేసాయి శాంతి కపోతాలు.. తెల్లహంసలు రాజ్యమేలుతున్నాయి దశాబ్దాలుగా నలిగిన స్వచ్ఛ, పురివిప్పిన నెమలైంది మసకబారిన మోడు బతుకులకు మట్టి వాసనే ప్రాణమైంది.
నేడు తంగడు పూలే బంగారు పూలయ్యాయి నా జమ్మిచెట్టు.. కొబ్బరి కంటే ఘనమై నిలిచింది నా బతుకమ్మ.. గొబ్బిళ్ల కంటే గొప్పదయ్యింది పాలపిట్టకంటే లోట్టపిట్టే కసిగా ఆరుస్తున్నది. ఆకలిదీరిన లేగదూడలు.. పొలిమేరలో సైన్యమయ్యాయి ఆరునెలల పసికూన.. అష్టావధానాన్ని ప్రాక్టీస్ చేస్తున్నది సిగ్నల్ దగ్గర చేయిచాపిన చిట్టి చేతులు.. సీ లాంగ్వేజ్ మీదన్నాయి సీసంగోలి, తుపాకి గోట్టానికి ఊపిరాడనివ్వడం లేదు ఎరుపెక్కిన అడవికొమ్మ.. అందంగా హరితాన్ని అద్దుకుంటుంది మోదుగు పువ్వు.. అత్తరు నదిలో స్నానం చేస్తున్నది అద్దంలో అమ్మ చంద్రున్ని చూపే రోజు మళ్లీ వచ్చింది7 శతాబ్దాలు పాలించిన కాకతీయులు నా ఊరి చెరువులో సేదతీరుతున్నారు భగీరథుడు ప్రతిఇంటి లోగిలిని ముద్దాడ వస్తున్నాడు తింటే గారెలు తిను.. కంటే కూతుర్నే కను అనే కల్యాణలక్ష్మి నా ఇంటి ముందే ఉంది బక్కపల్చని యోథుడొకడు.. మానవ మస్తిష్కాలకు ప్రతిరోజు ఇంజక్షన్ చేస్తూ… ఆద్భుత జన్యువులకై ప్రయోగం చేస్తునే ఉన్నాడు. అంబులపొదిలో అన్నీ అమర్చుకున్న నాగ్రామదాయి.. నాబిడ్డకు పురుడు పోయడానికి సమాయత్తమవుతుంది. మరణశయ్యలు, అంపశయ్యలు.. రానివ్వని మహత్ముడి కోసం సత్యం కోసం.. ఉరికొయ్యనందుకోవడానికి నిజం కోసం.. తనకుతాను శిలువవేసుకోవడానికి పుట్టే ప్రతిబిడ్డా సిద్దమవుతుందిక్కడ.ఈ గడ్డకున్న మహత్యం అది.. తెలంగాణ బిడ్డకున్న.. ఔన్నత్యం ఇది జై తెలంగాణ.. జైజై తెలంగాణ
– డాక్టర్ అన్నిమళ్ల కొండల్రావు
డీఎంహెచ్ఓ నల్లగొండ