సూర్యాపేట, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : మే 1 ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మిక లోకం ఘనంగా జరుపుకోనుండగా సూర్యాపేటలో భవన నిర్మాణ, అనుబంధ సంఘాలకు మంత్రి జగదీశ్రెడ్డి కాసింత నీడను ఇవ్వబోతున్నారు. నిర్మాణ రంగంలో తాపీ పనివారు మొదలు ఇంజినీరింగ్ వరకు 13సంఘాల్లో ఉండే సుమారు 15వేల మంది కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచేలా అన్ని యూనియన్లకు భవనాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కేసారం సమీపంలోని రెండెకరాల స్థలంలో సుమారు రూ.2 కోట్లతో యూనియన్ భవనాలకు మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోనే కార్మిక సంఘాలకు భవనాలు నిర్మిస్తున్నది సూర్యాపేటలోనే కావడం విశేషం.
సూర్యాపేట జిల్లాకేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘంతో పాటు నిర్మాణ రంగ అనుబంధ సంఘాలకు నూతన భవనాలు నిర్మించేందుకు మంత్రి జగదీశ్రెడ్డి నిర్ణయించారు. కేసారం సమీపంలో రెండెకరాల స్థలంలో సుమారు రూ.2కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టగా మేడే రోజైన సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. సాధారణంగా ఏ రంగంలో వారైనా యూనియన్లుగా ఏర్పాటయ్యేది వారి సంక్షేమం కోసమే. ప్రభుత్వ పరంగా అందాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ తదితరాలతో పాటు ఆయా సంఘాలకు స్థానిక ప్రజాప్రతినిధులు భవనాలు నిర్మించాలని కోరుకుంటారు.
అయితే గతంలో ఇక్కడ పాలించిన నాయకులు కార్మికులను పట్టించుకున్న దాఖలాలు లేవు. మంత్రి జగదీశ్రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనుల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా కార్మిక, దాని అనుబంధ సంఘాల ఇబ్బందులను గుర్తించారు. భానుపురి భవన నిర్మాణ కార్మిక సంఘం, దాని అనుబంధ సంఘాల్లోని సుమారు 15వేల మంది కార్మికులు వారి సమస్యలు, బాగోగులపై చర్చించుకునేందుకు సంఘ భవనాలు నిర్మిస్తున్నారు. తాపీ పనివారల సంఘం, ఎలక్ట్రీషియన్ యూనియన్, ప్లంబర్, పెయింటింగ్, సెంట్రింగ్, మార్బుల్స్, టైల్స్, మట్టి పని యూనియన్, పీఓపీ సీలింగ్ యూనియన్, రాడ్ బెండింగ్, కార్పెంటర్, బిల్డింగ్ మెటీరియల్తో పాటు బిల్డింగ్ ఇంజనీరింగ్ యూనియన్లకు భవనాలు నిర్మించేందుకు మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
కార్మికుల ఆత్మగౌరవం పెంపు
డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే సూత్రాన్ని అనుసరించే మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో భవన నిర్మాణ, అనుబంధ కార్మిక సంఘాలకు నీడనిచ్చేందుకు 13భవనాలు నిర్మించడం వారి ఆత్మగౌరవాన్ని పెంచడమే. ఇక్కడ చాలా ఏండ్లుగా భవనాల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా యూనియన్లు ఏర్పడేదే భవనాల కోసం కానీ గతంలో ఉన్న ఏ నాయకుడూ వారిని పట్టించుకోలేదు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి పెద్ద మొత్తంలో భవనాలు నిర్మిస్తుండడంపై మంత్రికి కార్మికులపై ఉన్న ప్రేమ అర్థమవుతుంది. ఇక మీదట వినియోగదారుల మన్ననలు పొందుతూ ఈ సంఘం మరింత ముందుకు వెళ్తుంది.
– పుట్ట కిశోర్, భానుపురి భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు