సూర్యాపేట, జూన్ 7 (నమస్తే తెలంగాణ) ;కరువు నేలను తడిపి తమ బతుకులను పచ్చగ చేసిన కాళేశ్వర గంగకు సూర్యాపేట జిల్లా జనం నీరాజనం పట్టింది. గోదావరి జలాలు తెచ్చి కన్నీటి చారలను తుడిపిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ముక్తకంఠంతో జేజేలు పలికింది. ఒకనాటి బీడు భూముల్లో సిరులు పండిస్తున్న 3 నియోజకవర్గాలు.. 7 మండలాలు.. 126 గ్రామాల రైతులు, మహిళలు, చిన్నాపెద్ద ఒక్కటై కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి పట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లాలోని పల్లెపల్లెనా బుధవారం బొడ్రాయి పండుగను తలపించేలా జల దినోత్సవం నిర్వహించారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపుతో లక్ష జనహారతిలో భాగస్వాములై ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పారు. కాళేశ్వరం నీటితో మొట్టమొదలు లబ్ధి పొందిన తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలంలోని ఈటూరు నుంచి చివరనున్న పెన్పహాడ్ మండలం రావిచెరువు వరకు 68 కిలోమీటర్ల మేర గోదావరి జలాలకు చేతులెత్తి మొక్కారు. కాల్వ గట్ల మీదే వంటలు వండి సంతోషంగా సహఫంక్తి భోజనం చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట నియోజకవర్గం చివ్వెంల మండలంలోని 71 డీబీఎం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మకు సారె, పసుపు, కుంకుమ సమర్పించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఈటూరు గ్రామంలో, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోటినాయక్తండా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు లక్ష జనహారతికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడం విశేషం. సమైక్య పాలనలో ఎడారిగా మారిన సూర్యాపేట జిల్లాకు గోదావరి జలాలు తెచ్చిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో అనూహ్య రీతితో 1,16,142 మంది పాల్గొనడంతో ఇది సాధ్యమైంది.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకలు సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్నాయి. బుధవారం సాగు నీటి దినోత్సవంలో భాగంగా కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి పేరుతో మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో జిల్లా ప్రజలు వినూత్న పద్ధతిలో కార్యక్రమం చేపట్టి ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతాంగం పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లక్ష జన హారతిలో పాల్గొని ముక్తకంఠంతో సీఎం కేసీఆర్కు జేజేలు పలుకుతూ గోదారమ్మకు నీరాజనం పట్టారు.
జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేటతోపాటు కోదాడలోని కొద్ది ప్రాంతం నాడు ఎట్లుండేది..? నేడు ఎట్లయ్యింది? అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తే, అధికారంలోకి రావాలనుకున్న అపోజిషన్ నేత మొక్కలు నాటారు. శంకుస్థాపన రాళ్లు ఈ ప్రాంత రైతాంగాన్ని వెక్కిరించేలా ఉండగా, నాటి ప్రతిపక్షనాయకుడు నాటిన మొక్కలు కాస్త వట వృక్షాలుగా మారయి తప్ప.. సమైక్యాంధ్రుల పాలనలో చుక్కనీరు రాలేదని గత సీమాంధ్ర పాలకులపై మంత్రి విరుచుకుపడ్డారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్తవాల్లో భాగంగా బుధవారం సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలు తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతూ లక్ష జన హారతి పేరుతో వినూత్న కార్యక్రమం చేపట్టారు. రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో దోపిడీని కనిపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం 6వేల క్యూసెక్కుల నీటిని 350 కిలోమీటర్ల దూరం పారించడం అసాధ్యమని ఉద్యమ కాలంలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు నాటి ఉద్యమ నేతగా ఉన్న ప్రస్తుత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలను మంత్రి జగదీశ్రెడ్డి గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి నీరు అందాలంటే మేడిగడ్డనే కరెక్ట్ అని లేల్చారన్నారు. అసాధ్యం అనుకున్న అనేక పథకాలను సుసాధ్యం చేస్తూ ప్రజల చెంతకు చేర్చుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ను పూర్తి చేసి గోదావరి జలాలు తెచ్చారన్నారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలే శరణ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహితతో కలిసి గోదావరి సజీవంగా ఉంటుందని మేడిగడ్డ వద్ద ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పట్లోనే అంకురార్పణ చుట్టారన్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ నుంచి మిడ్మానేరుకు అటు నుంచి లోయర్ మానేరు మీదుగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాలకు నీళ్లు పారించారని తెలిపారు.
దాంతో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో నేడు భూములు సస్యశ్యామలం కావడమే కాకుండా యావత్ భారత దేశంలోనే వరి దిగుబడిలో సూర్యాపేట రికార్డు సృష్టించిందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞత చెప్పుకునేందుకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నీటి పారుదల దినోత్సవం రోజును ఈ ప్రాంత రైతాంగం కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి కార్యక్రమం నిర్వహిస్తామని ముందుకు రావడం అభినందనీయమన్నారు. వాస్తవానికి లక్ష మందితో నిర్వహించాలి అనుకుంటే ఆ సంఖ్య 1.16లక్షలు దాటిందని అధికారిక గణాంకాలు వెల్లడించినట్లు తెలిపారు. కాళేశ్వరం జలాలతో మొదట లబ్ధి పొందిన తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ రైతాంగం స్వచ్ఛందంగా భాగస్వామ్యం అయినందునే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యిందని సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏడు మండలాల పరిధిలోని 126 గ్రామాలకు చెందిన రైతాంగం బోనాలు ఎత్తుకుని బతుకమ్మలు పేర్చి సామూహికంగా వంటా వార్పులు నిర్వహించి పండుగ వాతావరణంలో జరుపుకున్న లక్ష జన హారతి శాశ్వతంగా గుర్తిండి పోతుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, అదనపు కలెక్టర్ కేశవ్ హేమంత్ పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాళేశ్వరం నీళ్లు వస్తయనుకోలే..
గతంలో వ్యవసాయం చేసేందుకు నీరు, కరెంటు లేక భూములు బీళ్లుగా మారాయి. ఎన్ని బోర్లు వేసినా చుక్క నీరు రాని పరిస్థితి. వానకాలంలో చెరువుల్లో కొద్దిపాటి నీరు మాత్రమే ఉండేది. దాంతో ఒక కారుకు మాత్రమే నీరు అందేది. వ్యవసాయం చేయాలంటే ఎంతో కష్టంగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాళేశ్వరం ద్వారా కాల్వల్లో నీళ్లను చూస్తున్నాం. ఈ నీటితోనే చెరువులు నిండాయి. 24 గంటల కరెంటుతో రెండు కార్లు పంటలు పండిస్తున్నాం. గతంలో ఎకరం భూమి సాగు చేయలేని పరిస్థితి ఉండగా, నేడు నాలుగు ఎకరాలను సాగు చేస్తున్నాం. కాళేశ్వరం నీటితో సిరులు పండిస్తున్నాం. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డికి రుణపడి ఉంటాం
–కట్టా రాంరెడ్డి, రైతు, కోటపహాడ్, ఆత్మకూర్(ఎస్)
కాళేశ్వరం నీటితో వరి పండిస్తున్నాం
మాకు అరెకరం పొలం ఉంది. ప్రస్తుతం కాళేశ్వరం నీటితోనే వరి పండిస్తున్నాం. నా చిన్నతనం నుంచి చూశా. వర్షాదార పంటలు మాత్రమే పండించే వాళ్లం. అప్పుడు ఎక్కువగా పెసర, వేరుశనగ, కంది, ఉలువ తప్ప వేరే పంటలు చూడలే. అప్పుడు జొన్న అన్నం మాత్రమే తినే వాళ్లం. పండగో, పబ్బమో అయితే తప్ప వరి అన్నం తిన్న రోజులు లేవు. ఇప్పుడు కాళేశ్వరం నీటితో అందరూ వరి పంటే సాగు చేస్తున్నరు. ఇదంతా ఒకెత్తయితే పండించిన పంటను అమ్ముకోవాలంటే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రోజుల తరబడి ఎదురుచూసేవాళ్లం. ఇప్పుడు గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన మరుసటి రోజే ఖాతాల్లో డబ్బులు జమైతున్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన రైతు పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇది ముమ్మాటికీ రైతు ప్రభుత్వం. రైతులమంతా ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– శిగ నర్సయ్య, రైతు, చివ్వెంల
సాగు నీటి రంగంలో దేశానికే ఆదర్శం తెలంగాణ
సాగు నీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని కోటినాయక్తండా వద్ద ఎల్-36 కాల్వలో మండల నాయకులు, అధికారులతో కలిసి కాళేశ్వరం జలాలకు లక్ష జన హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సాగు నీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాలపై దృష్టి సారించి ప్రజల కష్టాలు తీర్చారని పేర్కొన్నారు. ఒకవైపు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే అభివృద్ధిని ఆపకుండా రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం జలాలతో మోతె మండలం సస్యశామలంగా మారిందన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులు లాభదాయకంగా వ్యవసాయం చేసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ యాదగిరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, మాజీ ఎంపీపీ ఆరె లింగారెడ్డి, ఏలూరి వెంకటేశ్వర్రావు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు పొనుగోటి నరసింహారావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కాంపాటి వెంకన్న, ప్రధాన కార్యదర్శి మద్ది మధుసూదన్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు కారింగుల శ్రీనివాస్ గౌడ్, నూకల శ్రీనివాస్రెడ్డి, సండ్ర మధు, నాని, పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు.