మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
సూర్యాపేట టౌన్, జూలై 19 : తన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆశీస్సులు అందించిన వారందరికీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఆరాధ్య దైవమైన ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు రాష్ట్ర టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పారు.
శుభాకాంక్షలు తెలిపిన ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు, ఎన్పీడీఎస్ సీఎండీ గోపాలరావు, టీఎస్ ఎస్పీడీసీఎస్ సీఎండీ రఘుమారెడ్డి, బోర్డు డైరెక్టర్లు, విద్యుత్ కార్మిక సంఘాలు, విద్యుత్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ను గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా మొక్కలు నాటడం, అన్నదానాలు, పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని మంగళవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.