తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రజా పాలకుడు, అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా సర్వం సిద్ధమైంది. శుక్రవారం సీఎం కేసీఆర్ 69వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అభిమా నులు, వివిధ వర్గాల ప్రముఖులు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశారు. నల్లగొండలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం చేపట్టేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి గురువారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించనుండగా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులంతా హాజరుకానున్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్న సీఎం కేసీఆర్ బర్త్డేను సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు, సంఘాల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎక్కడికక్కడే కార్యక్రమాల నిర్వహణకు ప్లాన్ రూపొందించారు. వీలైన చోట్ల రక్తదాన శిబిరాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోనూ వారి అవసరాలను బట్టి అన్నదానం, పాలు, పండ్లు, ఇతర వస్తువులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్డుతో పాటు కొన్ని చోట్ల మంచి భోజనం అందించేందుకు కూడా సిద్ధమయ్యారు. వీటితోపాటు గిఫ్ట్ ఏ స్మైల్ కింద నిరుపేదల అవసరాలు తీర్చేలా ఏదైనా పరికరాలు అందించేందుకు మరికొందరు సొంతంగా ప్లాన్ చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భాగస్వాములు అయ్యేందుకు పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. సర్వమత ప్రార్థనలకు సైతం ఏర్పాట్లు చేశారు. ఇదే సందర్భంగా కేసీఆర్కు అత్యంత ఇష్టమైన హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కూడా సన్నద్ధమయ్యారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబాటుకు చిరునామాగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగు, తాగునీటితో వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నది. అందుకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండలో మెగా రక్తదాన శిబిరానికి చేస్తున్న ఏర్పాట్లను గురువారం సాయంత్రం మంత్రి జగదీశ్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి పరిశీలించారు. రక్తదానానికి యువత పెద్ద సంఖ్యలో తరలి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని మంత్రి సూచించారు.
మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించనున్న మంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురష్కరించుకుని నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో మెగా రక్తదాన శిబిరానికి భారీ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 10గంటలకు కేక్ కటింగ్ అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల నుంచి రక్తదానంపై ఆసక్తి కనబరిచే వారిని ఇప్పటికే గుర్తించారు. వీరందరికీ టిఫిన్, భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. ప్రియతమ నేత కేసీఆర్ బర్త్డే వేడుకల్లో పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానాలు, సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాను ప్రత్యేక దృష్టితో సమగ్రాభివృద్ధిపథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై కృతజ్ఞత చాటాలని మంత్రి కోరారు.
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలి
నల్లగొండ, ఫిబ్రవరి 16 : ‘అవిశ్రాంత కార్మికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతను దేశమంతా స్వాగతిస్తున్నది. అలాంటి మహానేత పుట్టిన రోజు సందర్భంగా నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలతో పాటు నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 700 మందితో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని చూసి దేశ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేసి తమ రాష్ర్టాల్లోనూ ఈ అభివృద్ధి జరుగాలని కోరుకుంటూ సీఎం కేసీఆర్ దార్శనికతను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 70 ఏండ్ల వయసులోనూ దేశాన్ని ప్రగతి పథంలో నడుపాలనే ఆయన ఆలోచన ఎంతో గొప్పదన్నారు.
ప్రజలు ఊహించిన దానికంటే రాష్ర్టాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన మహా నాయకుడు కేసీఆర్ అని పొగిడారు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్టాన్ని సాధించి తన లక్ష్యం పూర్తయిందని విస్మరించకుండా దేశ పరిస్థితులపై చలించి దేశ రాజకీయాల వైపు కదిలిన కేసీఆర్కు ఇండియా స్వాగతం పలుకుతున్నదన్నారు. ఇలాంటి మహనీయుని పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో పూజలు, ప్రార్థనలు చేయాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, బీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, జమాల్ ఖాద్రీ, రావుల శ్రీనివాస్రెడ్డి, కొండూరు సత్యనారాయణ పాల్గొన్నారు.