సూర్యాపేట, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారతదేశమని, హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణుల పాత్ర గొప్పదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం దురాజ్పల్లి వద్ద రూ.2.50 కోట్లతో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మికతతో మానవుడికి సంతృప్తి, ధైర్యంలభిస్తుందన్నారు. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తూ సీఎం కేసీఆర్ ధర్మ పాలన చేస్తున్నారని తెలిపారు.బ్రాహ్మణులకు ఏ దేశంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్రంలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని, అర్చక ఉద్యోగులకు అత్యుత్తమమైన వేతన వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్,
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కె.వి.రమణాచారితోపాటు పలువురు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రపంచంలో ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు భారత దేశమని, అలాంటి దేశ ఆధ్యాత్మికతను నిలబెట్టడంలో బ్రాహ్మణుల పాత్ర గొప్పదని, అదేమార్గంలో అన్ని వర్గాలకు అన్నీ చేకూరేలా దేశంలోనే తెలంగాణ నంబర్వన్ అనేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపాలన చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణానికి చెందిన డాక్టర్ రామయ్య ఎకరం భూమిని ఉచితంగా అందించడంతో మంత్రి జగదీశ్రెడ్డి రూ.2.50 కోట్లతో జిల్లా కేంద్రంలోని దురాజ్పల్లి వద్ద నిర్మింపజేసిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని మంత్రి జగదీశ్రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. మానవుడికి ఆధ్యాత్మికత సంతృప్తి, ధైర్యాన్ని ఇస్తుందన్నారు.
మన దేశంలో ఆధ్యాత్మికతను బ్రాహ్మణులు కాపాడుకుంటూ వస్తుంటే అలాంటి బ్రాహ్మణులకు దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఎనలేని చేయూత ఇస్తున్నారన్నారు. ఒకానొక సమయంలో పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణులు, వ్యవసాయం చేసే రైతులకు పిల్లను ఇవ్వడం కూడా కష్టతరంగా మారగా, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేడు ఆ రెండు వర్గాలకు ప్రాధాన్యత, ఆదరణ పెరిగిందన్నారు. బ్రాహ్మణులకు సాయంపై కూడా కొంతమంది విమర్శలు చేశారని, కానీ పేదలు ఎవరైనా పేదవారే అని గుర్తించే ముఖ్యమంత్రి కేసీఆర్ గత తొమ్మిదేండ్లలో అద్భుతమైన శిల్పిలా ఒక్కొక్క మెట్టు చెక్కుతూ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. కేసీఆర్ వచ్చి ఏం చేశాడని కొంతమంది ప్రశ్నిస్తున్నారని, కానీ తెలంగాణ ప్రజల ఆకలి, దరిద్రాలను పారదోలారని.. ఇది నిజం కాదా? అని మంత్రి ప్రశ్నించారు. దేశంలోని కాంగ్రెస్, బీజేపీ పాలిత అత్యధిక రాష్ర్టాల్లో 35 శాతానికి పైనే కుటుంబాలు ఒక్కపూట తిని పస్తులతో ఉంటున్నారని పేర్కొన్నారు. అభివృద్ధికి సూచికలు తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగమని, ఈ రెండింటిలో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉందన్నారు. సూర్యాపేటలో బ్రాహ్మణుల కోసం ప్రభుత్వ పథకాలు ఆదుకుంటూనే ఉన్నాయని, ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా తాను ఉన్నాననేది గుర్తుంచుకోవాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా భూదాత డాక్టర్ రామయ్య, ఆయన కుటుంబ సభ్యులకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ వారిని మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి ఘనంగా సన్మానించారు.
బీఆర్ఎస్తోనే ఆలయాలకు పూర్వవైభవం : మంత్రి అల్లోల
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూత.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. సూర్యాపేటలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అర్చక ఉద్యోగులకు అత్యుత్తమమైన వేతన వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రూ.1400కోట్లు వెచ్చించి యాదాద్రి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లను కేటాయిస్తున్న ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ మాత్రమే అని తెలిపారు. విదేశాల్లో చదువుతున్న బ్రాహ్మణుల పిల్లలకు రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం, బ్రాహ్మణుల గౌరవ వేతనాలు పెంచడం, బ్రాహణులపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న ప్రేమకు నిదర్శనం అన్నారు. దేశంలోనే తొలి బ్రాహ్మణ సదన్ను హైదరాబాద్లోని గోపనపల్లిలో నిర్మితం కాగా ఆ తరువాత స్థానం సూర్యాపేటకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బ్రాహ్మణ సమాజం అండగా నిలువాలన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు మృత్యుంజయశర్మ, హనుమంతాచారి, రామ్మోహన్రావు, గోపాలశర్మ, వెంకటరమణశర్మ, సుమలతాశర్మ, విష్ణుదాసు శ్రీకాంత్తోపాటు యాదాద్రి ఆలయ ప్రధానార్చకుడు లక్ష్మీనర్సింహాచార్యులు పాల్గొన్నారు.
తెలంగాణ గ్రేట్ అంటున్న ఇతర రాష్ర్టాల బ్రాహ్మణులు
తాను గత తొమ్మిదేండ్లుగా చూస్తున్నా. నిజంగా బ్రాహ్మణులకు అత్యున్నత విలువలు ఇస్తూ వారికి చేయూత ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమే అన్నది గ్రేట్. తాను ఇతర రాష్ర్టాల బ్రాహ్మణ సదస్సులు, ఇతరత్రా మీటింగులకు వెళ్లినప్పుడు అక్కడివారు తాము తెలంగాణలో పుట్టి ఉంటే బాగుండేది. మీ రాష్ట్రంలో ఎంతో గౌరవం, ఆర్థిక చేయూత ఇస్తున్నారని అంటుంటే ఎంతో గర్వంగా ఫీలవుతున్నా. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిన సూర్యాపేటలో బ్రాహ్మణ సదన్ నిర్మించడం ఈ ప్రాంతానికే కాదు ఉమ్మడి నల్లగొండ జిల్లా బ్రాహ్మణులకు కూడా సంతోషదాయకం.
-చకిలం రాజేశ్వర్రావు, బ్రాహ్మణ సేవా సమాజం జిల్లా అధ్యక్షుడు
ధర్మాన్ని కాపాడే సీఎం ఉండడం అదృష్టం
ధర్మాన్ని, వేద శాస్ర్తాన్ని కాపాడే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టానికి పాలకుడుగా ఉండడం నిజంగా అదృష్టంగా భావించాల్సిందే. యథా రాజా, తథా ప్రజ అనే నానుడి కచ్చితంగా తెలంగాణకు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తి కాబట్టి అన్ని మతాలను గౌరవిస్తున్నారు. అందరికీ సమన్యాయం చేస్తున్నారు. అందుకే ఆయన అడుగు జాడల్లో రాష్ట్ర ప్రజలు ఆయన వెంటే ఉంటున్నారు. భవిష్యత్తులో ఉంటారు.
-ఎన్సీహెచ్ వేణుగోపాలాచార్యులు, తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణలోనే బ్రాహ్మణుల సంక్షేమం..
దేశంలోని అనేక రాష్ర్టాల్లో 70 శాతం బ్రాహ్మణులు ఉన్నా.. ఆయా ప్రభుత్వాలు బ్రాహ్మణ సమాజాన్ని కనీసం పట్టించుకోవడం లేదు. తెలంగాణ మాదిరి సంక్షేమం మరెక్కడా లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు అందుతున్నాయి. బ్రాహ్మణ పరిషత్ అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా సూర్యాపేటలో బెస్ట్ స్కీం కింద 134 మందికి 3.71 కోట్లు అందగా, నల్లగొండ జిల్లాలో 248 మందికి 6.89 కోట్లు అందాయి.
-సముద్రాల వేణుగోపాలాచారి, తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యుడు
బ్రాహ్మణ సమాజం కోసం ఇప్పటికే రూ.261 కోట్లు..
బ్రాహ్మణ సమాజం కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్రంలో రూ.261 కోట్లు వెచ్చించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో కొనసాగుతుండగా అన్ని వర్గాలకు మేలు జరుగుతున్నది. రాష్ట్రంలో వివేకానంద ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం ద్వారా 780 మందికి రూ.81.28 కోట్లు ఖర్చు చేయగా బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూరల్ పథకం కింద 5,446 మందికి రూ.161.77 కోట్లు, శ్రీరామానుజ స్కీం ద్వారా 442 మందికి 1.16 కోట్లు ఇలా అన్ని స్కీమ్లు కలిపి 7,106 మందికి రూ.261.16 కోట్లు అందాయి.
-వనం జ్వాలా నరసింహారావు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ వైస్ చైర్మన్
జగదీరెడ్డి మంత్రి కావడం మనందరి అదృష్టం
సూర్యాపేట ప్రాంతం గత తొమ్మిదేండ్లుగా దినదినాభివృద్ధి చెందుతూ వస్తున్నది. రూ.7వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించి నేడు రాష్ర్టానికే సూర్యాపేట ఒక ఐకాన్లా మారింది. వీటన్నింటికీ కారణం మంత్రి జగదీశ్రెడ్డి. ఆయన మంత్రిగా ఉండడం మన అదృష్టం. బ్రాహ్మణులు కూడా సమాజంలో ఒక భాగమే అని సీఎం కేసీఆర్ గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ మరో పక్క ధూప, దీప, నైవేద్యం కింద గౌరవ వేతనాలు ఇస్తున్నారు. మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు అన్నీ వస్తుండడంతోపాటు బ్రాహ్మణులకు తగిన గౌరవం లభిస్తుంది. బ్రాహ్మణుల ఆశీస్సులు మంత్రికి ఉండాలి.
-రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్