పైన సారున్నరు.. ఇక్కడ మీరు, మా ఎమ్మెల్యే ఉన్నరు
ఆ ధీమాతోనే వడ్లు వేసినం
మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, రైతు మధ్య ఆసక్తికర సంభాషణ
లాభదాయక పంటలు వేయాలని సూచించిన మంత్రి
మద్దిరాల, మే 6 : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గంలోని పోలుమళ్ల గ్రామానికి చెందిన రైతు నడుమ ఆసక్తికర సంభాషణ నడిచింది. మంత్రి గుంటకండ్ల, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్తో కలిసి శుక్రవారం సూర్యాపేటకు వెళ్తూ మద్దిరాల మండలంలోని ఎర్రపాడు క్రాస్ రోడ్డు వద్ద ధాన్యం కుప్పలను సరిచేస్తున్న రైతును చూశారు. కాన్వాయ్ ఆపి కారు దిగి ఆయనతో మాట్లాడారు. దిగుబాటు పొలాలైతే వరి వెయ్యాలి గానీ, చక్కగ చెల్క పొలాలు పెట్టుకుని ఎందుకు వరి వేసినవ్ అని అడగ్గా.. పైన కేసీఆర్ సారు, ఇక్కడ మీరు, మా ఎమ్మెల్యే గారు ఉన్నరన్న ధైర్యంతోనే వేసినం సార్ అని రైతు సొప్పరి ఏసు బదులివ్వడంతో అందరి మధ్య నవ్వులు పూశాయి.
మంత్రి జగదీశ్రెడ్డి : ఎన్నెకరాలు పెట్టినవ్ వరి
రైతు ఏసు : రెండెకరాలు పెట్టిన సార్
మంత్రి : ఎన్ని పుట్లయితయ్ వడ్లు
రైతు : పది పుట్లు అయితయ్
మంత్రి : ఏం వడ్లు పెట్టినవ్
రైతు : దొడ్డొడ్లు పెట్టినయ్యా..
మంత్రి : ప్రభుత్వం వద్దన్నగూడ దొడ్డొడ్లు పెట్టినవా!(నవ్వుతూ)
రైతు : పైన కేసీఆర్ సారున్నరని ధైర్యం. ఇక్కడ మీరు, మా ఎమ్మెల్యే గారు
ఉన్నరని ధీమా సార్ (నవ్వుతూ…)
మంత్రి : కేసీఆర్ గారు ఉన్నరన్న ధైర్యముందిగానీ బరువెక్కువ పెడితే సారు మాత్రం ఏం చేస్తరు(సున్నితంగా హెచ్చరిస్తూ..)
రైతు : ఇగ అట్ల జెయ్యం సారూ..
మంత్రి : మళ్లసారికన్నా చెప్పినట్టు ఇనాలె. లాభాలు వచ్చే పంటలు మీతోని పండియాల్ననేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. వరి కంటే ఎక్కువ పైసలొచ్చే వేరే పంట ఏదైనా పెట్టాలె. చెల్కల్ల బంగారం పండియొచ్చు. కూరగాయలు పెట్టి భార్యాభర్తలు కష్టపడితే రెండెకరాల్లో 4 లక్షల రూపాయలు సంపాదియొచ్చు.
రైతు : ఇదివరకు సొర, బెండ, కాకర పెట్టినయ్యా. రోజుకు 1,500 వచ్చేయి. రెండు బర్లుగూడ ఉన్నయ్.
మంత్రి : ఇంకేందయ్యా మరి! అరెకరంలో మంచిగ గడ్డి వెయ్. కోస్తా ఉంటే ఏడాదికి ఎనిమిది సార్లు వస్తది సొప్ప. మిగతా భూమిలో కూరగాయలు ఏస్కొని అమ్ముకో! మంచిగుంటది.
రైతు : సరే సార్.