గోడ కూలిన ఘటన మినహా ఎలాంటి ప్రమాదాల్లేవు
వానల్లోనూ నిరాటంకంగా విద్యుత్ సరఫరా
అంటువ్యాధుల నివారణకు అధికార యంత్రాంగం ఉపక్రమించాలి
బ్లీచింగ్, క్లోరినేషన్తో అడ్డుకట్ట వేయాలి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి
నల్లగొండ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష
నల్లగొండ, జూలై 13 : వరుస వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం తీసుకున్న ముందస్తు చర్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అభినందించారు. ఐదు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నా, ఉధృతి పెరిగినా గోడ కూలి ఇద్దరు చనిపోయిన ఘటన మినహా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎలాంటి ప్రమాదాలూ జరుగలేదని, రహదారులకు, పంటలకు కూడా నష్టం వాటిల్లకపోవడం సంతోషకరమని పేర్కొన్నారు. వర్షాలు-వరదల నేపథ్యంలో బుధవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ కుమార్, కలెక్టర్ రాహుల్ శర్మ, సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్తో కలిసి అధికారులతో సమీక్షించారు.
రహదారులు, పంటలు, రిజర్వాయర్లలో నీటి మట్టం, చెరువుల్లోకి చేరిన నీరు, విద్యుత్ సరఫరా తదితర అంశాలపై శాఖల వారీగా సమీక్షించారు. నల్లగొండ జిల్లాలో రహదారులు ఎక్కడా దెబ్బతినలేదని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు మంత్రికి వివరించారు. పంటలు, తోటల నష్టం జరుగలేదని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వానలకు 84 విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా వెంటనే పునరుద్ధరించినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. చెరువులకు ఎక్కడా గండ్లు పడలేదని ఇరిగేషన్ శాఖ యంత్రాంగం పేర్కింది. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని మున్సిపాలిటీలతోపాటు గ్రామపంచాయల్లోనూ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నీరు కలుషితం కాకుండా బ్లీచింగ్, క్లోరినేషన్, దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పంటల సాగుపై వ్యవసాయశాఖ అధికారులను అడగగా.. ఆరు లక్షల ఎకరాల్లో పత్తి, 3400 ఎకరాల్లో కంది సాగైనట్లు ఆశాఖ అధికారులు తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించి కంది సాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంతటి ప్రకృతి వైపరిత్యంలోనూ నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేసిన ఘనతకు కారణం సీఎం కేసీఆర్ అన్నారు. వందేండ్ల చరిత్రలోనే ఇంతటి వర్షం నమోదు కాలేదన్నారు. సూర్యాపేట జిల్లాలో నూటికి 200 శాతం నమోదైతే.. నల్లగొండలో 95 శాతం, యాదాద్రిలో నూటికి నూరు శాతం వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో వాతావరణశాఖ జారీ చేసిన హెచ్చరికలతో అధికారులను అప్రమత్తం చేయడం వల్ల నష్టం వాటిల్లలేదన్నారు. దానికి తోడు రోజు రోజుకు వర్షం ఉధృతి పెరుగుతుండడంతో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించటంతో పాటు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగిన నేపథ్యంలో మూడు జిల్లాల్లో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరించినట్లు తెలిపారు. అంటు వ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందస్తుగా నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో నల్లగొండ, నకిరేకల్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్కుమార్, కలెక్టర్ రాహుల్ శర్మ, సూర్యాపేటఎస్పీ రాజేంద్ర ప్రసాద్, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
లక్ష్మి కుటుంబానికి ఎక్స్గ్రేషియా
వర్షాలతో ఈ నెల 8న జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో గోడ కూలి మృతి చెందిన లక్ష్మి కుటుంబానికి రూ.ఆరు లక్షల ఎక్స్ గ్రేషియాను మంత్రి జగదీశ్రెడ్డి అందచేశారు. శ్రీకాకుళం నుంచి వలస వచ్చి పద్మానగర్లో కొన్నేండ్లుగా లక్ష్మి నివాసం ఉంటుంది. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గోడ కూలి నడికుడి లక్ష్మితో పాటు ఆమె కూతురు కల్యాణి మృతి చెందారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. ఎక్స్గ్రేషియాకు సంబంధించిన చెక్కును బుధవారం లక్ష్మి కుమారుడికి మంత్రి అందించారు.