యాదగిరిగుట్ట, నవంబర్ 25 : కరువు తాండవం చేసిన ఆలేరు నియోజకవర్గాన్ని పదేండ్లలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపాం. ఈ ప్రాంతానికి ఎంతో చేశాం. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. రాబోయే ఐదేండ్లలో ఆలేరును అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ఇది నా హామీ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఇప్పటికే 80 శాతం అభివృద్ధి పూర్తయ్యింది. ఈసారి చెల్లెమ్మ సునీతను 50 వేల మెజార్టీతో గెలిపిస్తే.. ఆలేరు అభివృద్ధి బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సూదగాని హరిశంకర్గౌడ్తో కలిసి శనివారం రోడ్షోలో పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారని, రానున్న రోజుల్లో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేసుకుందామన్నారు. యాదగిరిగుట్టలో 100 సీట్ల ఎంబీబీఎస్ మెడికల్ కళాశాల నిర్మించాల్సి ఉందన్నారు. దాంతో 500 పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానున్నదని తెలిపారు. ఆలేరు నియోజకవర్గానికి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ, టూరిజం హబ్ నిర్మించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు మంజూరయాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటుకాగానే పనులను ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల వేళ మోసపోతే గోస పడతామని అన్నారు.
ఎన్నికలంటే మూడురోజుల పండుగ కాదని, ఐదేండ్ల భవిష్యత్ అని తెలిపారు. పదేండ్లలో ఆలేరు నియోజకవర్గానికి సాగుజలాలు అందించామన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాలకు సాగుజలాలు అందించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రపంచమే గర్వించేలా సీఎం కేసీఆర్ గొప్పగా పునర్నిర్మించినట్లు చెప్పారు. ఏనాడైనా ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సోయి కాంగ్రెసోళ్లకు వచ్చిందా? అని ప్రశ్నించారు. బొమ్మలరామారం మండలంలోని మూడుచింతలపల్లి నుంచి వడపర్తి వరకు డబుల్ రోడ్డు నిర్మిస్తామన్నారు. 2001 నుంచి గొంగిడి సునీత ఉద్యమ నేత సీఎం కేసీఆర్ వెంట నడిచిందన్నారు. ఇలాంటి నాయకురాలికి ఆలేరు ప్రజలు రెండుసార్లు అండగా నిలిచారని, మరోసారి గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు.
రైతులకు రైతుబంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి అంటున్నారని, రైతులను బిచ్చగాళ్లుగా మారుస్తున్నారని వక్రీకరించినట్లు ఆరోపించారు. 24 గంటల కరెంటు వద్దు.. 3 గంటలు సాలు అంటున్నారు. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని మంత్రి హరీశ్రావు తెలిపారు. రైతుబంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. కానీ, ధర్మం గెలిచిందని, రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చిందన్నారు.
నేడు, రేపు బ్యాంకులకు సెలవులని మంగళవారం ఉదయం నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు నగదు జమ చేస్తామని చెప్పారు. ఒక్క చాన్స్ అంటున్న కాంగ్రెస్కు అవకాశమిస్తే ఆగం కావడం ఖాయమన్నారు. తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే సురక్షితమని చెప్పారు. రిస్క్ వద్దు.. కారు ముద్దు అని, ఎన్నో మంచి పనులు చేసిన కేసీఆర్ను సాదుకుందామా? చంపుకుందామా? ప్రజలు తేల్చుకోవాలన్నారు.
చీకటిమామిడి గ్రామంలో రోడ్ షో నిర్వహించిన మంత్రి హరీశ్రావుకు మహిళలు బొట్లు పెట్టి మంగళహారతులతో స్వాగతం పలికారు. జనం పెద్ద సంఖ్యలో రావడంతో ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. గ్రామంలోని అన్ని విధులు గులాబీమయంగా మారిపోయాయి. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, నాయకులు సూదగాని హరిశంకర్ గౌడ్, వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.