యాదాద్రి భువనగిరి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల మంజూరు చేసింది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు గురువారం యాదగిరి గుట్టలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకోగా అది కార్యరూపం దాల్చుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఉండగా దీంతో వాటి సంఖ్య మూడుకు చేరనున్నది. మెడికల్ కాలేజీ ఏర్పాటు ప్రకటనపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుకు ధన్యవాదాలు చెప్తున్నారు.
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే జిల్లాలో అన్ని అవసరాలు తీరుస్తున్న సరారు.. మరో అడుగు ముందుకేసి మెడికల్ కాలేజీ అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలుకానుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఉండగా.. దీంతో సంఖ్య మూడుకు చేరనుంది. మెడికల్ కాలేజీ ప్రకటనపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, హరీశ్ రావుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. యాదగిరిగుట్టలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి హరీశ్రావు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, యాదాద్రి భువనగిరిలో సైతం త్వరలో ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఒక ఏడాదిలో 8మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, ఈ ఏడాది మరో 9మెడికల్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ సైతం లేదు. కొత్తగా జిల్లాకు మెడికల్ కాలేజీ ప్రకటనపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే విద్యా సంవత్సరానికి అనుమతులు వచ్చే అవకాశముంది.
సూపర్ స్పెషాలిటీ సేవలు
ఏదైనా పెద్ద వ్యాధి వస్తే చికిత్స పొందాలన్నా.. మెరుగైన వైద్యానికి హైదరాబాద్కు పరుగెత్తాల్సిన పరిస్థితి. చికిత్స కోసం వారాలు, నెలల పాటు ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు వైద్య విద్య సైతం భారంగా మారింది. కానీ స్వరాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేయడంతో పాటు, వైద్య విద్యను తెలంగాణ విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్దేశించుకన్నారు. ఇప్పుడు జిల్లాకు మెడికల్ కాలేజీ రానుండటంతో అన్ని రకాల సేవలు అందనున్నాయి. మెడికల్ కాలేజీలతో స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుతాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కలుపుకొని, మొత్తం 35 వైద్య విభాగాల సేవలు అందే అవకాశముంది. అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్స్ ఉంటాయి. డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటుంది.
విద్యార్థులకు వైద్యవిద్య
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరిగింది. రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా చదువుకునే అవకాశాలు పెరిగాయి. మెడికల్ కాలేజీలతో అనుబంధంగా అనేక వసతులు ఏర్పడుతాయి. హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది. వీటిల్లో పని చేయ డానికి భారీగా సిబ్బంది అవసరం ఉంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.