‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. సీఎం కేసీఆర్
నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. వారంటీ లేని పార్టీల గ్యారెంటీలను నమ్మరు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో
వ్యాపారులు, మైనార్టీలు, మెకానిక్లు, యువతతో శనివారం ఆయన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకొనే ధైర్యం ఆ పార్టీలకు లేదన్నారు. 2014 నుంచి ఏటా సంపదను పెంచుతూ సంక్షేమాల రూపంలో అందరికీ పంచుతున్నామని తెలిపారు. సాగు, తాగునీటితోపాటు 24 గంటల కరెంట్,
పల్లె నుంచి పట్టణం వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్కు అండగా ఉంటాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ర్టానికి తిరుగేలేదని చెప్పారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
సూర్యాపేట టౌన్, నవంబర్ 18 : అరవై ఏండ్లకు పైగా ఆగం చేసి.. ఉద్యమ సమయంలోనూ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అటువంటి అభివృద్ధి నిరోధకులైన నాయకులు, వారంటీ లేని పార్టీలు ఇస్తున్న గ్యారెంటీలను ప్రజలు నమ్మరని తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో వ్యాపారులు, మైనార్టీలు, మెకానిక్లు, యువత, నూతన ఓటర్లు స్వచ్ఛంద ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి మంత్రిని ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అలాగే పెద్ద ఎత్తున యువకులు బీఆర్ఎస్లో చేరగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాడి సాధించిన తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయత్వంలో గత పదేండ్లుగా జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాలు కండ్ల ముందు కనిసిస్తున్నాయని.. అటువంటి అభివృద్ధి చేసే పార్టీకే మరోమారు పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతం మాట పక్కనపెడితే ప్రస్తుతం అధికారంలో ఉండి కాంగ్రెస్, బీజేపీలు పాలిస్తున్న రాష్ర్టాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయో తెలంగాణ ప్రజలకు వివరించే ధైర్యం ఆ రెండు పార్టీలకు ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో గత పదేండ్లుగా సాధించిన అద్భుత ప్రగతిని తామే కాదు ప్రజలే ఆనందంగా వివరిస్తారన్నారు. అన్ని రంగాల్లో గడిచిన, గడుస్తున్న అభివృద్ధితో పాటు భవిష్యత్ తరాలకు వనరులు సమకూర్చాలనే ముందుచూపుతో ఆలోచన చేస్తున్న ఏకైక సీఎం మన కేసీఆర్ అని కొనియాడారు.
2014 నుంచి ప్రతి ఏటా సంపదను పెంచుతూ సంక్షేమాల రూపంలో అందరికీ పంచుతున్నట్లు చెప్పారు. ఆకలిచావుల తెలంగాణను సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేర్చినట్లు వివరించారు. సూర్యాపేట ప్రజలకు మూసీ మురికి నీటిని తాపిన పాపం కాంగ్రెస్దేనని దుయ్యబట్టారు. అటువంటి మూసీ మురికి నుంచి విముక్తి కలిగించి నేడు స్వచ్ఛమైన కృష్ణా జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా యావత్ దేశంలోనే 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అన్నారు. 2014 కు ముందు విద్యుత్, నీరు సరిగా లేక, వ్యాపారాలు కొనసాగక వలసలు వెళ్లే పరిస్థితుల నుంచి నేడు మన దగ్గరికే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చే స్థాయిలో అభివృద్ధి చేసుకున్నట్లు వెల్లడించారు.
ఇంతటి అభివృద్ధిని కండ్లారా చూస్తున్న ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని.. అన్ని రంగాల ప్రజలు ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసుకుని తనను ఆహ్వానించి మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమాల్లో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ చెరుకు సుధాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు, నాయకులు డాక్టర్ రామ్మూర్తియాదవ్, మొరిశెట్టి శ్రీను, ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్, బత్తుల జానీయాదవ్, తోట శ్యామ్, రాచర్ల కమలాకర్, సాయి, మణి, వసంత్తో పాటు ఆయా సంఘాల నాయకులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.