స్వరాష్ట్రంలో విద్యారంగం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ విద్యకు ప్రాధాన్యం ఇచ్చి సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి చివ్వెంల మండలం ఐలాపురం క్రాస్ రోడ్డు వద్ద రూ.4.2 కోట్లతో నిర్మించిన తెలంగాణ బాలికల గిరిజన గురుకుల కళాశాల, పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, అంబేద్కర్, సంత్ సేవాలాల్ వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. మన ఊరు-మన బడితో సర్కారు బడులు కొత్తగా మారాయని, విద్యార్థులకు నాణ్యమైన చదువుతోపాటు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధిక గురుకులాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.
– చివ్వెంల, అక్టోబర్ 8
చివ్వెంల, అక్టోబర్ 8 : విద్యతోనే జీవితానికి వెలుగు వస్తుందని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. శనివారం రాత్రి చివ్వెంల మండలంలోని ఐలాపురం క్రాస్ రోడ్డు వద్ద హైదరాబాద్- ఖమ్మం రహదారి పక్కన రూ.4.2 కోట్లతో నిర్మించిన తెలంగాణ గిరిజన గురుకుల కళాశాల, పాఠశాల భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి మంచి ర్యాంక్లు సాధించి భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. సమాజాన్ని పీడిస్తున్న కులాల అంతరాలు పోవాలంటే విద్య వల్లే సాధ్యమని తలంచి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వెయ్యి గురుకులాలను నెలకొల్పినట్లు తెలిపారు. ఆడ పిల్లలు సౌకర్యాలు లేక విద్యను మధ్యలోనే ఆపివేస్తున్నారని, వారికి రెసిడెన్సియల్ కళాశాలలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. కళాశాల కాంపౌండ్ వాల్, రోడ్డు నిర్మాణం, సోలార్ స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినట్లు త్వరలోనే పనులు ప్రారంభిస్తారని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో జట్పీటీసీ భూక్యా సంజీవ్నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్రెడ్డి, సర్పంచ్ బోడపట్ల సునీతాశ్రీను, ఎంపీటీసీ బుచ్చమ్మ, కళాశాల ఆర్సీ లక్ష్మయ్య, ప్రిన్సిపాల్ మంజుల, ఉప సర్పంచ్ వినోద్, జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, ప్రకాశ్ పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం..
బొడ్రాయిబజార్ : సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం రాత్రి సూర్యాపేటలోని దాసాయిగూడెంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, 23వ వార్డులో మాల కమ్యూనిటీ హాల్, 7వ వార్డులో ఎరుకల కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించడంతో పాటు 21వ వార్డులో నూతనంగా నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో ఆయా కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలను నిర్మించి వారి సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
2014 తర్వాత సూర్యాపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. సూర్యాపేటను రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్ వన్ పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్కు మద్దతుగా నిలబడి అభివృద్ధిలో భాగస్వామ్యం అందించాలని కోరారు. అన్ని మతాలు, జాతులు, సంస్కృతులను సమానంగా గౌరవిస్తున్న ఏకైక రాష్ట్రం, ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. సూర్యాపేట అభివృద్ధిపై గతానికి, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకుని అభివృద్ధికి అండగా నిలబడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, కమిషనర్ పి.రామానుజులరెడ్డి, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు వల్దాస్ సౌమ్యాజాని, కుంభం రేణుకారాజేందర్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాశ్, కుంభం రాజేందర్, బత్తుల జాని, వల్దాస్ జాని, గాజుల రాంబాయమ్మ, యశోదారవి, బొల్లెద్దు దశరథ, మీర్జాల వేణు బలరాం, అంబేద్కర్ యూత్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.