‘అనేక పోరాటాలు, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఉద్యమ సమయంలో ఏ ఆశయం కోసం తపించారో నేడు అవన్నీ నెరవేరుతున్నాయి. అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. వ్యవసాయానికి సాగునీరు, నిరంతర విద్యుత్, రైతు బంధు తదితర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. తొమ్మిదేండ్లలో ప్రజలకు సమస్త వనరులు, సకల సౌకర్యాలు సమకూరాయి. ప్రజల బాధలు తీరడంతో సంతోషంగా ఉన్నారు’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని ఆయన జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్తో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలకనుగుణంగా సాగుతున్న పాలన, తొమ్మిదేండ్ల జిల్లా ప్రగతిని మంత్రి వివరించారు.
– సూర్యాపేట, జూన్ 2 (నమస్తే తెలంగాణ)
రాష్ట్ర ఆవిర్బావ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట ప్రగతిపథంలో పయనిస్తూ తెలంగాణకే రోల్ మోడల్గా మారుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు సమస్త వనరులు, సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్లు చెప్పారు. అనేక పోరాటాలు.. ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవిశ్రాంతంగా కృషితో ప్రజల బాదలు తీరి కుటుంబాల్లో సంతోషాలు నిండాయన్నారు. రాష్ర్టావతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వేడుకకు మంత్రి జగదీశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటగా సభ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద మంత్రి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్తో కలిసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి సాగునీరు, నిరంతర విద్యుత్, రైతు బంధు తదితర పథకాలతో తెలంగాణను దేశానికే దిక్సూచిలా మార్చారన్నారు. గత తొమ్మిదేళ్లలో దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీనే ఎక్కువ అనే విషయం స్వయానా కేంద్రం ప్రకటించే లెక్కలే చెబుతున్నాయన్నారు. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించిచనట్లు తెలిపారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి అయోగ్ తన నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడించారు.
పంటల క్యాలెండర్ ముందుకు
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పంటల క్యాలెండర్ను నెల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అందుకు రైతులంతా సహకరించాలని కోరారు. వానాకాలంలో దీర్ఘకాలిక రకాల పంటలను మే 25 నుంచి జూన్ 5లోపు, మధ్యకాలిక రకాలను జూన్ 1లోపు అలాగే స్వల్పకాలిక రకాలను జూన్ 25లోపు విత్తుకున్నట్లయితే అక్టోబర్ మూడో వారం నుంచి నవంబర్ మొదటి వారం లోపల కోతలను పూర్తి చేసుకోవచ్చన్నారు. అలాగే యాసంగి సీజన్లో నవంబర్ 15 నుంచి 20 మధ్యలో విత్తుకుంటే మార్చి నెలాఖరు నుంచి ఏప్రిల్ మొదటి వారంలో కోతకు వచ్చి పంట అకాల వర్షాల భారిన పడకుండా ఉంటుందన్నారు.
వ్యవసాయ అనుబంధ రంగాలకు సాయం అందించడంతో పాటు, నీటి ఇక్కట్లకు పరిష్కారం చూపిందన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి చేసిందని తెలిపారు.