యాదగిరిగుట్ట, జనవరి 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే దేవాలయాలు పూర్వవైభవం సంతరించుకుంటున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట దేవాలయాన్ని పునర్నిర్మించి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు.
ఆదివారం సాయంత్రం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండపైకి చేరుకున్న మంత్రి స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అద్దాల మండపం వద్ద ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి మాట్లాడుతూ చరిత్రలో నభూతో నభవిష్యత్తు అన్న చందంగా సీఎం కేసీఆర్ నరసింహుడి ఆలయాన్ని తీర్చిదిద్దారని చెప్పారు.
దేవాలయం భక్తి పారవశ్యం పొంగిపొర్లే విధంగా జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని స్వామివారిని వేడుకున్నట్లు వివరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పట్టణ నాయకుడు కాంటేకర్ పవన్కుమార్ తదితరులు ఉన్నారు.