చౌటుప్పల్ రూరల్, అక్టోబర్ 22 : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థంతోనే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఆరెగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.18వేల కాంట్రాక్టు కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. వచ్చిన డబ్బులతో ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నాడని, ఇక్కడి ప్రజలు తెలివైన వారని ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ప్రజలు అతడిపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడేండ్లలో ఒక్క సారి కూడా గ్రామాల ముఖం చూడలేదన్నారు. కనీసం సీఎం రిలీఫ్ఫండ్, కల్యాలణలక్ష్మి ఫారాలపై కూడా సంతకాలు చేయని అసమర్థ నాయకుడని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలతో అతడి రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనని, మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మునగాల ప్రభాకర్రెడ్డి, ఉపసర్పంచ్ జాల మమతామల్లేశ్ యాదవ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఎన్నపల్లి ముత్తిరెడ్డి పాల్గొన్నారు.
చౌటుప్పల్ రూరల్ : మండలంలోని ఆరెగూడెంలో గ్రామస్తులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కృషి చేశారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక పరిశ్రమ సహకారంతో వాటిని పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి గ్రామ పెద్దలతో కలిసి పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్రామంలో 10 కిలోమీటర్ల మేర బీటీరోడ్డు, ప్రత్యేక వైద్యశాల, స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఆధునిక పాఠశాల భవనం, ఫంక్షన్హాల్, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని పరిశ్రమ యాజమాన్యానికి మంత్రి సూచించారు. అయితే దశల వారీగా వీటిని ఏర్పాటు చేస్తామని పరిశ్రమ యాజమాన్యం మంత్రికి హామీ ఇచ్చారు. తమ సమస్యలు తీరుతుండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.