బొడ్రాయిబజార్, ఫిబ్రవరి 18 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.17 కోట్లతో చేపడుతున్న పుల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాత కట్టకు కొత్త కళ తేవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం సాయంత్రం పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్బండ్ కట్ట నిర్మాణ పనులను కట్ట వెంట కలియ తిరుగుతూ పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. మినీ ట్యాంక్బండ్ నిర్మాణంలో భాగంగా కట్ట కింద రోడ్డు డౌన్ అవుతున్నందున కట్ట ఎక్కడానికి మెట్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు పార్క్ను ఏర్పాటు చేసి పచ్చదనంతో తీర్చిదిద్దాలన్నారు. అలాగే కట్టను మరికొంత వెడల్పు చేసి కట్ట వెంట గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. కట్ట ముందు భాగం ఆవరణలో ఎత్తు పెంచి బతుకమ్మ చౌరస్తాను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఆయన వెంట సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కాంట్రాక్టర్ శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వల్దాస్ జాని, ఆకుల లవకుశ, మకట్లాల్, పీఆర్డీఈ రమేశ్, ఏఈ పాండూనాయక్ ఉన్నారు.
సోనాలిక ప్రొడక్ట్పై మంత్రి జగదీశ్రెడ్డి ఆసక్తి
సోనాలిక కంపెనీకి చెందిన నూతన ప్రొడక్ట్ సోనాలిక 90 హెచ్పీ (హార్స్పవర్) ఇంజిన్ పనితీరుపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆసక్తి కనబరిచారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సూర్యాపేట షోరూం డీలర్ పాశం వేమారెడ్డిని ట్రాక్టర్కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొత్త ఇంజిన్ పనిచేసే విధానం, మైలేజీ తదితర విషయాలను మంత్రికి డీలర్ వేమారెడ్డి వివరించారు. ఆయన వెంట పెన్పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, సూర్యాపేట జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్ తదితరులు ఉన్నారు.