రామగిరి, మార్చి 16 : నేటి ఆధునిక యుగంలో కామర్స్ ఆవశ్యకత ఎంతో పెరిగిందని, కామర్స్ కోర్సులు చదివే విద్యార్థులకు సమాజంలో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఎంజీయూ వీసీ సీహెచ్ గోపాల్రెడ్డి అన్నారు. ఎంజీయూ డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లాలోని యూజీ, పీజీ స్థాయిలో కామర్స్ కోర్సులు చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసి ప్రతిభకు పదునుపెట్టేలా శనివారం ప్రేరణ పోటీలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.చెన్నప్పతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. కామర్స్ సబ్జెక్టుపై విద్యార్థుల్లో దాగి ఉన్న స్కిల్స్ వెలికితీసి ప్రోత్సహించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీసీఏ అధ్యక్షుడు చెన్నప్ప, ఎంజీయూ ప్రొఫెసర్ ఆకుల రవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో విద్యార్థులకు కామర్స్ సబ్జెక్టుపై ప్రేరణ పోటీలు నిర్వహించామన్నారు.
యూనివర్సిటీ స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడంతోపాటు కామర్స్లో పరిశోధనలు చేసి జీవితంలో స్థిరపడేలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పవర్ పాయింట్ ప్రజేంటేషన్తో కామర్స్ విద్య ఆవశ్యకత, విశిష్టతపై వివరించారు. యూనివర్సిటీ స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేశారు. ఎంజీయూ డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్ అసోసియేట్ ప్రొఫెసర్, ప్రేరణ కన్వీనర్ శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లాలోని వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.