మేళ్లచెర్వు, ఫిబ్రవరి 12 : మేళ్లచెర్వులో జాతర సందర్భంగా నిర్వహిస్తున్న ఎడ్ల పందేలు జోరుగా సాగుతున్నాయి. పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి జనం భారీ గా తరలివచ్చారు. మహిళల విభాగంలో కృష్ణా జట్టు ప్రథమ, సూర్యాపేట జట్టు ద్వితీయ బహుమతులు గెలుపొందగా..రంగారెడ్డి జట్టు మూడో, వైజాగ్ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.
ఎద్దుల పందెంలో మంగళవారం నిర్వహించిన సీనియర్స్ విభాగంలో హైదరాబాద్కు చెందిన ఎస్ఎస్ బుల్స్ ఎద్దులు ప్రథమ స్థానంలో నిలిచాయి. వీటితో పాటు మిగిలిన బహుమతులను కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఆమె పోటీలను వీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కొట్టె పద్మాసైదేశ్వర్రావు, జడ్పీటీసీ శాగంరెడ్డి పద్మాగోవిందరెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, చైర్మన్ శాగంరెడ్డి శంభిరెడ్డి, ఎరా రియాలిటీ చైర్మన్ పోశం నర్సిరెడ్డి, పాల్గొన్నారు.
మహా శివరాత్రి సందర్భంగా మేళ్వచెర్వు మండల కేంద్రంలోని ఇష్ట కామేశ్వరీ సహిత శంభులింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజు మంగళవారం మహా పూర్ణాహుతి కార్యక్రమం జరిపించారు. వేకువ జామున అభిషేకాలు, అర్చనలు, హోమాలు, విశేష పూజలు, త్రిశూల స్థానం తదితర ఘట్టాలను అర్చకులు కొంకపాక రాధాకృష్ణమూర్తి, విష్ణువర్ధన్శర్మ, ధనుంజయశర్మ నిర్వహించారు. అనంతరం స్వామి వారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్థానిక టీటీడీ కల్యాణమండపంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.